IPL 2026 matches: ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది గంటల్లో మొదలు కాబోతోంది. చిన్నస్వామి స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు.. సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడబోతున్నాయి. రెండు జట్లలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు పోటీని కాస్త పక్కన పెడితే.. కీలకమైన బౌలర్లు గాయపడడం.. వారి స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకున్న నేపథ్యంలో.. ఈసారి ఆ స్థాయిలో మజా లభిస్తుందా.. అభిమానులు ఆసక్తిగా ఐపిఎల్ తిలకిస్తారా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో పోటీ ఎలా సాగుతుంది.. జట్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని ఏ మేరకు విజయవంతం అవుతాయి అనేది చూడాల్సి ఉంది.
ఐపీఎల్ లో పది జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో.. ట్రోఫీ ఏ జట్టు దక్కించుకుంటుందనే చర్చ మొదలైంది. బెంగళూరు గత సీజన్లో విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఈసారి కూడా ట్రోఫీ అందుకోవాలని భావిస్తోంది. కొన్ని వైఫల్యాలు పక్కన పెడితే.. మిగతా వాటిల్లో బలంగానే కనిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ గత రెండు సీజన్లుగా గొప్పగా ఆడటం లేదు. అయితే ఈసారి జట్టు కూర్పును మొత్తం మార్చేసింది. రవీంద్ర జడేజ రాజస్థాన్ జట్టుకు వెళ్లిపోయాడు. సంజు శాంసన్ భారీ ధరకు చెన్నై జట్టులోకి వచ్చేసాడు. కార్తీక్ శర్మ.. ప్రశాంత్ వీర్ వంటి ప్లేయర్లు చెన్నై జట్టులో వజ్రాయుధాలుగా కనిపిస్తున్నారు.
Also Read: ఐపీఎల్ 2026.. తొలి బంతి ఇంకా పడనేలేదు.. టోర్నీ మొదలైంది
ముంబై ఇండియన్స్ గడచిన ఐదు సంవత్సరాలుగా ఐపిఎల్ ట్రోఫీ గెలవలేదు. ఆ జట్టులో ఉన్న ప్లేయర్ల ప్రకారం చూసుకుంటే ట్రోఫీ గెలుచుకునే సామర్థ్యం ఉంది. గత ఏడాది ప్లే ఆఫ్ వెళ్లినప్పటికీ.. కీలక దశలో ముంబై తలవంచింది. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
ఆశ్చర్యకరంగా ఈ మూడు ప్రధాన జట్లకు ఇతర జట్ల రెండవ వేదికలలో మ్యాచ్లు కేటాయించారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా సొంత గడ్డ గౌహతిలో.. ఈ మూడు జట్లు రాజస్థాన్ రాయల్స్ తో పోటీ పడతాయి. పంజాబ్ కింగ్స్ రెండవ సొంత గడ్డ, ఐపీఎల్ లీగ్ చైర్మన్ అరుణ్ ధమాల్ సొంత ప్రాంతమైన ధర్మశాలలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడుతుంది. బెంగళూరు జట్టు తమ రెండవ హోమ్ గ్రౌండ్ అయిన రాయ్ పూర్ లో ముంబై, కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతుంది. రాయ్ పూర్ బిసిసిఐ సంయుక్త కార్యదర్శి ప్రభతేజ సింగ్ భాటియా సొంత గడ్డ.
ఇక మిగతా జట్ల విషయానికి వస్తే.. కోల్ కతా నైట్ రైడర్స్ 2024 సీజన్లో ట్రోఫీ గెలుచుకుంది. గత ఏడాది తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. మరి ఈసారి ఎలాంటి ఆట తీరు కొనసాగిస్తుందో చూడాలి. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ జట్లు ప్రభావవంతమైన ఆట తీరు కొనసాగించాయి. పంజాబ్ మాత్రమే ఫైనల్ చేరుకుంది. 11 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్లే ఆఫ్ చేరుకుంది పంజాబ్. మరి ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి.
హైదరాబాద్ జట్టు 2024 లో ఫైనల్ వెళ్ళింది. గత ఏడాది గొప్పగా ఆడలేదు. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్.. లక్నో జట్లు కూడా ప్రధాన పోటీలో ఉన్నప్పటికీ.. వారి అస్థిరమైన ప్రదర్శన అంచనాలను అందుకోలేకపోతోంది. ఈసారి గిల్, పంత్ తమ నాయకత్వ పటిమతో జట్లకు ఎలాంటి విజయాలు అందిస్తారో చూడాల్సి ఉంది.. అయితే అన్ని జట్లలో యువకులు ఉండడంతో.. పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అన్ని జట్లకు సారదులుగా ఇండియన్ ప్లేయర్లు ఉండడం ఈసారి గమనార్హం.