Homeక్రీడలుSRH Vs RCB: హెడ్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ భారీ స్కోరు

SRH Vs RCB: హెడ్ ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ భారీ స్కోరు

SRH Vs RCB: ఊచకోత.. ముమ్మాటికీ ఊచకోత.. ఇది ట్రావిస్ హెడ్ బెంగళూరు జట్టుపై, వారి సొంత మైదానంలో చేపట్టిన పరుగుల యాత్ర.. ఒకటా, రెండా వరుసపెట్టి ఫోర్లు.. అంతకుమించి సిక్సర్లు.. సింగిల్స్, డబుల్స్ అంటే బోర్ అనుకున్నాడేమో.. నిలబడి ఫోర్లు కొట్టాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు బాదాడు. ఇలా ఏకంగా 41 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు.

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు సొంత మైదానం అని తెలిసినప్పటికీ కూడా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లు గా వచ్చారు.. అభిషేక్ శర్మ 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ ల సహాయంతో 34 పరుగులు చేశాడు. టోప్లి బౌలింగ్లో పెర్గూసన్ కు క్యాచ్ ఇచ్చి ఆటయ్యాడు. హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 108 పరుగులు జోడించారు. అది కూడా కేవలం 8.1 ఓవర్లలోనే. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్లాసెన్ మైదానంలోకి వచ్చాడు. అతడు హెడ్ కలిసి వీర విహారం చేశారు. బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు.

ముఖ్యంగా హెడ్ పెను తుఫాను లాంటి ఇన్నింగ్స్ తో బెంగళూరు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. కేవలం 41 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. అంతేకాదు తొలి వికెట్ కు హెడ్ అభిషేక్ శర్మతో కలిసి 27 బంతుల్లోనే 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పితే.. క్లాసెన్ తో కలిసి రెండో వికెట్ కు 14 బంతుల్లోనే 31 పరుగులు జోడించి హైదరాబాద్ జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు. హెడ్ బ్యాటింగ్ ధాటికి బెంగళూరు బౌలర్లు అలా మౌనంగా చూస్తూ ఉండిపోయారు. హెడ్ సెంచరీ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానులు మైదానంలో కేరింతలు కొట్టారు. 41 బాల్స్ లో సెంచరీ చేయడం ద్వారా హైదరాబాద్ జట్టు తరఫున హెడ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ ఆటగాడిగా ఘనత నెలకొల్పాడు. అతడి కంటే ముందు డేవిడ్ వార్నర్ , జానీ బెయిర్ స్టో, హరిబ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ హైదరాబాద్ జట్టు తరఫున సెంచరీలు చేశారు.

హెడ్ అలా ఆడితే.. క్లాసెన్ మరింత విధ్వంసంగా ఆడాడు. 31 బాల్స్ ఎదుర్కొని రెండు ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 67 రన్స్ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇదే హైదరాబాద్ జట్టు మార్చి 27న హైదరాబాద్ వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇప్పటివరకు అది ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ గా ఉంది. కేవలం రెండు మ్యాచ్ల వ్యవధిలోనే హైదరాబాద్ జట్టు తన రికార్డును తనే బద్దలు కొట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగుల భారీ స్కోరు చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version