India vs Sri Lanka : సూర్య నాయకత్వం.. గంభీర్ శిక్షణ.. భారత జట్టు లంకను జయిస్తుందా?

ఇక లంక బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ అసలంక, నిశాంక, కుశాల్ మెండిస్, శానక మోస్తున్నారు. అయితే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆ జట్టను కలవరపాటుకు గురిచేస్తోంది. బౌలింగ్లో పతిరన, హసరంగ కీలకంగా ఉన్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 11:34 am

India vs Sri Lanka

Follow us on

India vs Sri Lanka : టీ -20 వరల్డ్ కప్ గెలిచింది. జింబాబ్వే తో జరిగిన టీ -20 సిరీస్ ను దక్కించుకుంది. యువ ఆటగాళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇన్ని సానుకూల పరిణామాల మధ్య టీమిండియా శ్రీలంకలో అడిగి పెట్టింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే 3 t20 మ్యాచ్ ల సిరీస్ లో భారత జట్టు లంకతో అమీ తుమి తేల్చుకోనుంది. అయితే ఈ టీ 20 సిరీస్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో టీమిండియా ఆడుతున్న తొలి టి20 సిరీస్ ఇదే. ద్రవిడ్ పదవి కాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్ గా నియమితుడైన తర్వాత జట్టు ఎంపికలో తన మార్కు చూపించేశాడు. అయితే తుది జట్టు ఎంపిక తర్వాత.. మ్యాచ్ లో గంభీర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడునేది కూడా కీలకంగా మారింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సూర్య కుమార్ యాదవ్ నాలుగో నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గిల్, జైస్వాల్ భారత జట్టు ఇన్నింగ్స్ మొదలుపెడతారు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ గా రిషబ్ పంత్ వస్తాడు. మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, శివం దూబే కీలకంగా మారారు. అక్షర్ పటేల్ కు తోడుగా సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ బౌలింగ్ ను పంచుకుంటారు. మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తారు.

ఒక రోజు వెనక్కి జరిపారు

వాస్తవానికి షెడ్యూల్లో తొలి టీ20 జూలై 26న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దానిని జూలై 27 కు మార్చారు. రెండో టి20 జూలై 28, మూడవ టి20 జూలై 30న నిర్వహిస్తారు.. టి20 టోర్నీ మూసిన తర్వాత ఆగస్టు నుంచి భారత్ – శ్రీలంకల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. 2021 తర్వాత శ్రీలంకతో భారత్ ఆడే వైట్ బాల్ ద్వైపాక్షిక టోర్నీ ఇదే.. ఇక భారత ఇన్నింగ్స్ ను యశస్వి జైస్వాల్ తో కలిసి గిల్ ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్, విరాట్ కోహ్లీ టీ20 లకు వీడ్కోలు పలికిన తర్వాత.. జైస్వాల్ , గిల్ కు బీసీసీఐ ఓపెనర్లుగా అవకాశం కల్పించింది. అయితే వచ్చిన అవకాశాన్ని వారు ఎలా సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.. వాస్తవానికి టి20 ప్రపంచ కప్ కోసం జైస్వాల్ ను 15 మంది క్రీడాకారుల జాబితాలోకి తీసుకోవడంతో గిల్ అవకాశాన్ని కోల్పోయాడు. అయితే జైస్వాల్ కు అవకాశం వచ్చినప్పటికీ.. ఆడేందుకు ఆస్కారం లభించలేదు. అయితే జైస్వాల్ శ్రీలంక టోర్నీలో మెరుస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

వారిద్దరి మధ్య పోటీ

ఇక రిషబ్ పంత్, సంజు శాంసన్ మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది. టి20 ప్రపంచ కప్ టోర్నీలో సంజు కంటే పంత్ ముందుగా ఎంపికయ్యాడు. ప్లే -11 లో అవకాశం లభించడంతో సత్తా చాటాడు. అందువల్లే అతడికి శ్రీలంక టోర్నీలో అవకాశం లభించింది. ఇక మరో ప్రమాదకరమైన ఆటగాడు రింకు సింగ్ కు ఇంతవరకు సరైన అవకాశాలు రాలేదు. అయితే అతడు ఈ సిరీస్లో సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ లో దూకుడు అయిన బెటర్ గా పేరుపొందిన రింకు సింగ్.. ఈ సిరీస్ లో తన ప్రతిభను చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సాధించిన విజయాలలో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్ లోను అతడు బంతి, బ్యాట్ తో సత్తా చాటాలని భావిస్తున్నాడు. పాండ్యాకు తోడుగా ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండడం భారత జట్టుకు లాభించే అవకాశం.

లంకకు గాయాల బెడద

ఇక లంక బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ అసలంక, నిశాంక, కుశాల్ మెండిస్, శానక మోస్తున్నారు. అయితే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం ఆ జట్టను కలవరపాటుకు గురిచేస్తోంది. బౌలింగ్లో పతిరన, హసరంగ కీలకంగా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రసారమవుతుంది. సోనీ లీవ్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

జట్ల అంచనా ఇలా

టీమిండియా

గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్/ ఖలీల్ అహ్మద్, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.

శ్రీలంక

కుశాల్ మెండిస్, నిశాంక, ఫెరీరా, అవిష్కా ఫెర్నాండో, అసలంక (కెప్టెన్), హసరంగ, శానక, మధు శంక, బినుర, పతిరణ, తీక్షణ.