India vs Pakistan : రోహిత్ సేన కు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? దాయాది మాజీ క్రికెటర్లు ఏమంటున్నారు?

మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ పై పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు.." ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో సూర్య కుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు

Written By: NARESH, Updated On : June 9, 2024 7:31 pm

IND-PAK

Follow us on

India vs Pakistan : మరి కొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ లోని నసావు క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, పాకి స్థాన్ జట్లు తల పడబోతున్నాయి. ఇప్పటికే ఈ మైదానం వార్తల్లో నిలుస్తోంది. పిచ్ పై నిలకడలేని తేమ వల్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఈ మైదానంపై ఐర్లాండ్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇక మిగతా జట్లు ఆడిన మ్యాచ్లలో ధారాళంగా వికెట్లు నేలకూలాయి. బౌలర్లు బౌన్సర్లతో చెలరేగుతుంటే.. బ్యాటర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నారు. ఇలాంటి ఈ మైదానంపై భారత్, పాకి స్థాన్ తలపడబోతున్న నేపథ్యంలో భారీ పరుగులు నమోదు కావడం కష్టమని తెలుస్తోంది. పైగా భారత్, పాకి స్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి.. మరి ఆదివారం నాడు జరిగే మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాల్సి ఉంది.

మైదానం ఉన్న పరిస్థితి ప్రకారం భారీగా పరుగులు నమోదు కావడం కష్టమని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో దాయాదుల పోరు పై పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రం, వకార్ యూనిస్, కమ్రాన్ అక్మల్ ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ” గత టి20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. గత రికార్డులు భారత జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. నా మనసు మాత్రం పాక్ గెలవాలని కోరుకుంటుంది. న్యూయార్క్ మైదానంపై ఉన్న తేమను పరిశీలిస్తే.. ఇది పేస్ బౌలింగ్ కు సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.. ఇలాంటి మైదానాలలో టాస్ గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ లభిస్తుంది. బౌన్స్ ను అంచనా వేసి.. ఆ స్థాయిలో బౌలింగ్ చేసిన జట్టు కచ్చితంగా గెలుస్తుందని” వకార్ యూనిస్ పేర్కొన్నాడు.

60% అవకాశాలు ఆ జట్టుకే..

వకార్ అలా మాట్లాడితే.. పాకిస్తాన్ జట్టుకు చెందిన మరో మాజీ క్రికెటర్ వసిం అక్రమ్ తనదైన స్పందన తెలియజేశాడు..” భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే కచ్చితంగా అంచనాలు పెరిగిపోతాయి.. ఇక ప్రస్తుత జట్ల బలబలాలు చూస్తే భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కచ్చితంగా వారు విజయం సాధించేందుకు 60 శాతం అవకాశం ఉంది. ఆదివారం జరిగే మ్యాచ్లో అత్యుత్తమంగా ఆడే జట్టు కచ్చితంగా గెలుస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే భారత్ 60%, పాక్ 40% విజయాలు సాధించే అవకాశం ఉంది. టీ 20 మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. క్షణాలలో మ్యాచ్ పరిస్థితి మారే అవకాశం ఉంటుందని” వసీం పేర్కొన్నాడు..

మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ పై పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు..” ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో సూర్య కుమార్ యాదవ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆటపరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. సూర్య కుమార్ యాదవ్ టి20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ఇంతవరకు సూపర్ ఇన్నింగ్స్ ఆడలేదు. సూర్య తన టాప్ స్థానాన్ని నిరూపించుకోవాలంటే అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకోవాలని” కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.