India vs Pakistan : ఎటు తిరుగుతుందో తెలియని పిచ్… టాస్ ఓడిన భారత్… జర జాగ్రత్తగా ఆడండి!

India vs Pakistan భారత్ బ్యాటింగ్ కు దిగుతున్న నేపథ్యంలో "ఎటు తిరుగుతుందో తెలియని పిచ్.. జర జాగ్రత్తగా ఆడండి" అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : June 9, 2024 9:26 pm

India vs Pakistan

Follow us on

India vs Pakistan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం న్యూయార్క్ న సావు మైదానం వేదికగా పాకిస్తాన్, భారత్ తలపడుతున్నాయి. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. మైదానంపై తేమ ఎక్కువగా ఉండడంతో.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో.. మ్యాచ్ ను ఎంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఔట్ ఫీల్డ్ పై కవర్లను కప్పి ఉంచారు. ఆకాశం పారదర్శకంగానే కనిపిస్తున్నప్పటికీ.. అమెరికన్ వాతావరణం వల్ల ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఇలాంటి మైదానంపై బ్యాటింగ్ చేయడం దాదాపు కష్టం. అలాగని బౌలర్లకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండవు. అయితే ఈ మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మైదానాన్ని టీ 20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసింది.. వంద రోజుల్లోనే మైదానాన్ని నిర్మించింది. చూసేందుకు పచ్చికతో బాగానే కనిపిస్తున్నప్పటికీ.. ఆశ్చర్యకరమైన రీతిలో బౌన్స్, స్లోగా ఉన్న ఔట్ ఫీల్డ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ మైదానంపై ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరిగాయి. ఇందులో రెండు మ్యాచ్లలో 100 పరుగులు కూడా నమోదు కాలేదు. ఈ పిచ్ పై ఇంతవరకు నమోదైన అత్యధిక స్కోరు 137 గా ఉంది.. ఇక ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు ఈ మైదానం వేదికగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి ఛేదించింది. భారత్ – ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లోనూ వంద లోపే స్కోర్లు నమోదయ్యాయి. ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 97 పరుగుల వద్దే ఆగిపోయింది. భారత్ ఆ లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో చేదించింది. ఇక మరో మ్యాచ్లో కెనడా 137 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 125 కే పరిమితమైంది. ఇంకొక మ్యాచ్లో నెదర్లాండ్స్ 104 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించేందుకు దక్షిణాఫ్రికా 18.5 ఓవర్ల పాటు ఆడాల్సి వచ్చింది.

ఈ మైదానంపై ఇటీవల భారత్, ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. ఐర్లాండ్ బౌలర్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో టీమ్ ఇండియా కెప్టెన్ రవి శర్మ గాయపడ్డాడు. అర్థ సెంచరీ సాధించిన అనంతరం రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. ఈ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలోనూ ఆటగాళ్లు గాయపడ్డట్టు వార్తలు వినిపించాయి. మైదానం తీరు ఇలా ఉండడంతో ఐసీసీ, బీసీసీఐకి టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ” ఈ గ్రౌండ్ మా సొంత మైదానం కాదు. ఈ వేదికపై రెండు మ్యాచ్ లు ఆడాం. అయినప్పటికీ అవగాహన లేదు. పిచ్ క్యూరేటర్ సైతం ఆందోళనలో ఉన్నాడని” టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడంటే పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మైదానంపై ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు జరిగాయి. అత్యధిక స్కోరు 137 గా నమోదయింది. భారత్ – పాక్ జట్లు ఆదివారం ఈ మైదానం వేదికగా కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ప్రస్తుతానికి ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత్ బ్యాటింగ్ కు దిగుతున్న నేపథ్యంలో “ఎటు తిరుగుతుందో తెలియని పిచ్.. జర జాగ్రత్తగా ఆడండి” అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.