సీనియర్ క్రికెటర్లు ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధిస్తున్నారు. దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు కొనసాగిస్తున్నారు. కానీ అదే యువ జట్టు విషయానికి వచ్చేసరికి పరిస్థితి రివర్స్ అవుతోంది. ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్లలో పాకిస్తాన్ చేతిలో భారత యువజట్టు భంగపాటుకు గురైంది. వైభవ్ సూర్య వంశీ, ఆయుష్ మాత్రే వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. టీమిండియా కీలక దశలో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది..
ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటివరకు వరుసగా విజయాలు సాధించింది. దర్జాగా సూపర్ 6 కు చేరుకుంది. కానీ, సూపర్ 6 లో పాకిస్తాన్ జట్టుతో పోటీపడాల్సి రావడం ఒకరకంగా భారత అభిమానుల్లో కలవరపాటుకు గురిచేసింది. ఈ దశలో భారత జట్టు గత తప్పులను పునరావృతం చేయకుండా ధైర్యంగా అడుగులు వేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి.. గొప్పగా పరుగులు చేయకపోయినప్పటికీ గౌరవప్రదమైన స్కోర్ చేసింది…
బీభత్సమైన ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ (30) ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ అరుణ్ జార్జ్ (16) త్వరగానే అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే(0) డక్ అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన వేదాంత్ త్రివేది(68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 47 పరుగులకే వైభవ్ సూర్య వంశీ, ఆయుష్, జార్జ్ అవుట్ అయినచోట.. వేదాంత్ స్థిరంగా నిలబడ్డాడు. పాకిస్తాన్ బౌలర్లను పకడ్బందీగా కాచుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 47 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి 109/4 వరకు టీమిండియాను తీసుకొచ్చాడు. ఆ తర్వాత అభిజ్ఞాన్ (16) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత త్రివేది కూడా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కనిష్క్ చౌహన్(36) ఎంతో విలువైన పరుగులు చేశాడు. అంబరీష్ (29) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కిలాన్ పటేల్(21) స్ఫూర్తిదాయకమైన బ్యాటింగ్ చేశాడు.
పాకిస్తాన్ జట్టు 23 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మెరుగైన భాగస్వామ్యాలు నిర్మించింది. రెండో వికెట్ కు 65, మూడో వికెట్ కు 63 పరుగులు జోడించింది. ఒక దశలో 151/3 వద్ద స్థిరంగా నిలబడింది. దీంతో పాకిస్తాన్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో ఆయుష్ మాత్రే, కిలాన్ పటేల్ మ్యాజిక్ చేశారు. ఆ తర్వాత కీలక దశలో చౌహాన్ అదరగొట్టాడు. బ్యాట్ ద్వారా సత్తా చూపించిన అతడు.. బౌలింగ్లో కూడా అదరగొట్టాడు. తద్వారా టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. అతని వల్లే టీమిండియా ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది. దర్జాగా సెమీఫైనల్ లోకి వెళ్లింది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడిస్తే.. భారత జట్టు ఫైనల్ లోకి వెళ్తుంది.