IND VS BAN : ఒక్క రోజులోనే 411 పరుగులు, 18 వికెట్లా?.. డౌటే లేదు.. ఆటగాళ్లు ఇలా ఆడితే టెస్ట్ మ్యాచ్ కు కచ్చితంగా ఫ్యాన్స్ పెరుగుతారు..

ఒక్కరోజే 411 పైగా పరుగులు.. 18 వికెట్లు.. ఇదేదో టీ -20 మ్యాచ్ అని భ్రమ పడకండి.. ఈ రికార్డు చోటుచేసుకుంది టెస్ట్ మ్యాచ్ లో.. అదేంటి అలా కూడా జరుగుతుందా? అని ఆశ్చర్యపడకండి. అలానే జరిగింది.. భారత జట్టు అలా చేసి చూపించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 30, 2024 8:30 pm

IND Vs BAN Test Match

Follow us on

IND VS BAN :  రెండు రోజులపాటు వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు. దీంతో రెండవ టెస్టు డ్రా అవుతుందని అనుకున్నారు. కానీ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త మలుపులు తిరుగుతోంది కాన్పూర్ టెస్ట్ మ్యాచ్. గ్రీన్ పార్క్ మైదానం వేదికగా సోమవారం మ్యాచ్ మొదలైంది. అంతకుముందు కురిసిన వర్షం వల్ల మైదానం పూర్తిగా తడిగా ఉండడంతో రెండు, మూడు రోజుల్లో ఆట ఆడటం సాధ్యం కాలేదు. చివరికి నాలుగో రోజు మ్యాచ్ అనుకున్నట్టుగా సాగింది. అయితే ఏకంగా 18 వికెట్లు నేలకూలాయి. సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. ఇప్పటికీ 26 పరుగుల వెనుకంజులో ఉంది. అశ్విన్ రెండు వికెట్లు సాధించాడు. ఇస్లాం 7*, మోమినుల్ హక్ 0* తో క్రీజ్ లో ఉన్నారు. నాలుగో రోజు 107/3 తో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 233 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మోమినుల్ హక్ 107 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కెప్టెన్ షాంటో 31, మెహదీ హసన్ మిరాజ్ 20 పరుగులు చేసి సత్తా చాటారు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు సాధించాడు. సిరాజ్, అశ్విన్, ఆకాష్ దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ 205/6 వద్ద నిలిచింది. అయితే భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో 28 పరుగులతో చివరి 4 వికెట్లను నష్టపోయింది.

దూకుడుకు అసలైన అర్థం

బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలి ఎన్నింటికి మొదలుపెట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. 285/9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత ఆటగాళ్లు టి20 తరహాలో బ్యాటింగ్ చేశారు. స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (72: 51 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు), రోహిత్ శర్మ (23: 11 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్ లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుంది. గిల్(39: 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. 9 పరుగులు చేసిన పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ (47: 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్), కేఎల్ రాహుల్ (68: 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. షాకీబ్ అల్ హసన్ కూడా 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు ప్రపంచ రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుంది. 50, 100, 150, 200, 250 పరుగులను అత్యంత వేగంగా చేసి టెస్ట్ క్రికెట్లో సరికొత్త రికార్డును సృష్టించింది.

గత రికార్డులను పరిశీలిస్తే..

టెస్ట్ క్రికెట్లో బంగ్లాదేశ్ పై భారత్ కాన్పూర్ వేదికగా 10.1 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఇక వెస్టిండీస్ పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా 2023లో జరిగిన మ్యాచ్లో భారత్ 12.2 ఓవర్లలోనే శతక భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. 2001లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 13.1 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. 2012లో మీర్పూర్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలోని వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 2022లో పాకిస్తాన్ జట్టు పై రావల్పిండి మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 13.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. 2012 లో పెర్త్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 13.6 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్లపరంగా భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ఏకంగా 90 సిక్స్ లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 14 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2022 లో ఇంగ్లాండ్ 89, 2021లో భారత్ 87, 2014లో న్యూజిలాండ్ 81, 2013లో న్యూజిలాండ్ 71 సిక్స్ లు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించాయి.