Duleep Trophy 2024 : తమ్ముడు సెంచరీ చేస్తే.. అన్న శివతాండవం చేశాడు.. ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు కొట్టాడు..

ఆకాష్ దీప్ వేసిన పదో ఓవర్ లో సర్ఫరాజ్ వరసగా ఐదు బౌండరీలు కొట్టాడు. తొలి బంతిని వదిలేసి, మిగతా పంతుల్ని ఫోర్లు కొట్టాడు. ఏకంగా 20 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి బంతిని డిఫెన్స్ ఆడిన సర్ఫరాజ్.. తర్వాత బంతిని గల్లీ మీదుగా ఫోర్ కొట్టాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 7, 2024 8:28 pm

Duleep Trophy 2024

Follow us on

Duleep Trophy 2024 : దేశవాళీ క్రికెట్ ను బలోపేతం చేసి.. ఆటగాళ్లలో నైపుణ్యం మరింత పెంచేందుకు బీసీసీఐ ఈసారి దులీప్ ట్రోఫీని సరికొత్తగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇండియా – ఏ జట్టు, ఇండియా – బీ తల పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా – బీ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా – బీ జట్టు ఆరు వికెట్ల నష్టపోయి150 రన్స్ చేసింది. ఇండియా – ఏ జట్టు కంటే 240 రన్స్ లీడ్ లో నిలిచింది.

ఇండియా – బీ జట్టులో రిషబ్ పంత్ 41 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 61 రన్స్ చేశాడు. సర్పరాజ్ ఖాన్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 46 రన్స్ చేశాడు. యశస్వి జైస్వాల్ 9, అభిమన్యు ఈశ్వరన్ 4, ముషీర్ ఖాన్ (0), నితీష్ రెడ్డి (19) దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు.. మూడో రోజు ఆట ముగుస్తుందనగా.. చివరి ఓవర్లో నితీష్ వికెట్ కోల్పోయాడు . ప్రస్తుతం క్రీజ్ లో సుందర్ (6*) ఉన్నాడు. ఇండియా – ఏ జట్టులో ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. 22 పరుగులకే ఇండియా – బీ జట్టు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ దశలో పంత్, సర్ఫ రాజ్ బాధ్యతాయుతంగా ఆడారు. మూడో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. ముఖ్యంగా సర్ఫరాజ్ టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 29 బంతుల్లోనే పంత్ తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. నిన్న తమ్ముడు ముషీర్ ఖాన్ దంచికొడితే.. అన్న సర్ఫరాజ్ ఈరోజు విరుచుకుపడ్డారు.

వరుసగా ఐదు ఫోర్లు

ఆకాష్ దీప్ వేసిన పదో ఓవర్ లో సర్ఫరాజ్ వరసగా ఐదు బౌండరీలు కొట్టాడు. తొలి బంతిని వదిలేసి, మిగతా పంతుల్ని ఫోర్లు కొట్టాడు. ఏకంగా 20 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి బంతిని డిఫెన్స్ ఆడిన సర్ఫరాజ్.. తర్వాత బంతిని గల్లీ మీదుగా ఫోర్ కొట్టాడు. మూడో బంతిని కవర్ దిశగా బౌండరీకి తరలించాడు. నాలుగో బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా ఫోర్ కొట్టాడు. ఐదు బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా ఫోర్ కొట్టాడు.. ఇక అంతకుముందు ఇండియా – ఏ జట్టు 134/2 తో ఓవర్ నైట్ స్కోర్ తో మూడోరోజు ఆటను ప్రారంభించింది. 231 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. రియాన్ పరాగ్ (30) వెంటనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (37) రన్స్ చేశాడు. ముఖేష్ కుమార్, నవదీప్ షైనీ చెరో మూడు వికెట్లు సొంతం చేసుకున్నారు. సాయి కిషోర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఇండియా – బీ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 321 రన్స్ చేసింది. ముషీర్ ఖాన్ 181, నవదీప్ షైనీ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు.