ఐపీఎల్ మ్యాచ్ల్లో నేడు కీలక పోరు జరుగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్కు నేటి మ్యాచ్ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్తో సన్రైజర్స్ తలపడనుంది. గత నాలుగు మ్యాచుల్లో ఒకే ఒక దాంట్లో గెలిచిన సన్రైజర్స్.. ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లాలంటే ఈ మ్యాచ్లో గెలుపు తప్పనిసరి. అలా విజయం సాధిస్తేనే ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరుకుంటుంది. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ చేరడానికి మిగతా మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
Also Read: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ ఏమన్నాడంటే?
అబుదాబీ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు సన్రైజర్స్–కోల్కత్తా మ్యాచ్ ప్రారంభం కానుంది. సన్రైజర్స్ గెలవాలని ఆ జట్టు అభిమానులంతా కోరుకుంటున్నారు. ఓపెనర్లు వార్నర్-బెయిర్ స్టోతోపాటు మనీష్ పాండే, విలియమ్సన్ రాణిస్తేనే ఆ జట్టు భారీ స్కోర్ చేయగలదు. ఇప్పటికే పలు వైఫల్యాలను ఆ జట్టు చవిచూస్తూనే ఉంది. మరోవైపు భువీ లేని లోటు కూడా కనిపిస్తోంది. ఫామ్లో ఉన్నట్టే కనిపించిన రషీద్ ఖాన్ ఇంతకు ముందులా వికెట్లు తీయలేకపోతున్నాడు. బౌలింగ్ విభాగంలో సందీప్ శర్మ, నటరాజన్, రషీద్ కీలకం కానున్నారు.
కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ పియూష్ చావ్లాను ఆడించే అవకాశం ఉంది. చావ్లా ఆడితే.. లాకీ ఫెర్గ్యూసన్ రూపంలో మరో పేసర్ను సైతం ఆడించడానికి ఆ జట్టుకు అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో కోల్కతా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. వికెట్లు కూడా తీయడం లేదు. చెన్నై, పంజాబ్లతో జరిగిన మ్యాచ్ల్లో బౌలింగ్ ప్రతిభతోనే గెలిచినప్పటికీ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమిన్స్ వికెట్ల వేటలో వెనుకబడ్డాడు. రస్సెల్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు.
Also Read: ఐపీఎల్: పంజాబ్ జట్టు ఫామ్లోకి ఎందుకు రావట్లేదు..?
ఇటీవల ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి కోల్కత్తా యాజమాన్యం జట్టు బాధ్యతలను ఇయాన్ మోర్గాన్కు అప్పగించింది. కొత్త కెప్టెన్ ఈ మ్యాచ్లో ఏం మ్యాజిక్ చేస్తాడోనని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కతా ఓపెనర్లలో గిల్ నిలకడగా రాణిస్తుండగా.. మరో ఓపెనర్తో సమస్య ఎదురవుతోంది. ఈ రెండు జట్లను చూస్తుంటే ఇరు జట్లు కూడా దాదాపు సేమ్ ప్రాబ్లమ్స్తోనే ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి నేటి మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.