Dhoni Comeback: 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది.. అప్పట్లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా విశ్వ సమరంలో విజేతగా నిలిచింది. మళ్లీ ఆ ఘనత అందుకోవడానికి 2011 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. 2011 తర్వాత మళ్లీ టీం ఇండియా విశ్వవిజేత కాలేక పోయింది.
2023లో టీమిండియా తుది అంచె వరకు వెళ్లినప్పటికీ.. ట్రోఫీ అందుకోలేకపోయింది. స్వదేశంలో ఈ టోర్నీ జరిగినప్పటికీ టీమిండియా కంగారుల చేతిలో తలవంచాల్సి వచ్చింది. ఆ బాధ ఇప్పటికీ సగటు భారత క్రికెట్ అభిమానిలో ఉంది. అయితే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఎలాగైనా విజేతగా నిలవాలని బీసీసీఐ బలమైన నిర్ణయంతో ఉంది. అందువల్లే మేనేజ్మెంట్ ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
2011లో టీమిండియాను విజేతగా నిలిపిన ధోని కి మళ్లీ ద్వారాలు తెరిచింది. అయితే ఈసారి అతడు ఆటగాడిగా కాకుండా.. మెంటార్ గా రాబోతున్నాడు. దానికి ధోని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే వచ్చేముందు ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో రిషబ్ పంత్ కు చోటు కల్పించాలని ధోని కోరినట్టు తెలుస్తోంది. పంత్ అద్భుతమైన ఫినిషర్ అని.. అతడి సేవలు 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయని ధోని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనికి మేనేజ్మెంట్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ కు భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా గౌతమ్ గంభీర్.. అసిస్టెంట్ కోచ్ గా దస్కటే, పర్యవేక్షకుడిగా ధోని.. ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్, బౌలింగ్ కోచ్ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కొనసాగుతారు.. ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2011లో విశ్వ సమరంలో గెలిచినప్పుడు.. నాడు జట్టులో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మీద అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు 2011 నాటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయాలంటే ధోని అవసరమని మేనేజ్మెంట్ భావించడం.. దానికి అతడు ఓకే చెప్పడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
