Suryakumar Yadav Captaincy Removal: భారత క్రికెట్ రాజకీయాలు, అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై సిట్ విచారణ జరుగుతోంది. ఇక రాజకీయ జోక్యం ఎప్పటి నుంచో ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆ పార్టీ అనుకూలులు ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అమితషా కుమారుడు జైషా బీసీసీఐ చీఫ్గా ఎన్నికైన తర్వాత ఈ ఆరోపణలకు బలం చేకూరింది. అయితే క్రికెట్లో కుల రాజకీయాల ప్రస్తావన పెద్దగా ఉండదు. కానీ తాజాగా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ తప్పింపు వెనుక కుల వివక్ష, అమిత్ షా కుమారుడు జై షా ప్రమేయం అంటూ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన ఆరోపణ చేశారు. ‘సూర్య కెప్టెన్సీలో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. అయినా అకస్మాత్తుగా ఎందుకు తొలగించారు? అతను యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాడు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక అమిత్ షా కుమారుడు జై షా ఉన్నారు. బీసీలు, దళితులు, మైనారిటీలపై అన్ని రంగాల్లో వివక్ష కొనసాగుతోంది’ అని ఆరోపించారు.
సూర్య కెప్టెన్సీలో భారత్ విజయాలు..
సూర్యకుమార్ యాదవ్ను గత సంవత్సరం టీ20 ఫార్మాట్కు పూర్తి స్థాయి కెప్టెన్గా నియమించిన తర్వాత భారత్ అనేక సిరీస్లలో ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఆధ్వర్యంలో భారత జట్టు యువ ఆటగాళ్లను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లింది. అయినప్పటికీ ఇటీవలి కొన్ని సిరీస్లలో సూర్య వ్యక్తిగత ప్రదర్శన కాస్త తగ్గిన నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ను బాధ్యతలు అప్పగించింది.
కులం ఆరోపణల్లో నిజమెంత?
అశుతోష్ సిన్హా ఆరోపణలు స్పష్టంగా రాజకీయ రంగును సంతరించుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఉత్తరప్రదేశ్కు చెందిన యాదవ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆటగాడు కావడం, బీజేపీ నాయకుడు అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉండటం వీటిని కలిపి చూసి ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్లో యాదవ్ వోట్ బ్యాంకు బలమైన సామాజిక సమీకరణం కావడంతో, సమాజ్వాదీ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
క్రికెట్లోకి కులం, రాజకీయాలు..
ఈ ఆరోపణలు క్రికెట్ రంగంలో కులం, రాజకీయాలు, సామాజిక సమీకరణాలు చొరబడుతున్నాయన్న చర్చను మరోసారి రేకెత్తించాయి. బీసీసీఐ అధికారులు మాత్రం ఈ నిర్ణయం పూర్తిగా ప్రదర్శన, జట్టు భవిష్యత్ ఆధారంగానే తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్కు చేసిన కృషి, అతని 360 డిగ్రీ బ్యాటింగ్ స్టైల్, టీ20లో అతని ఆధిపత్యం ఇవన్నీ దేశవ్యాప్తంగా అభిమానులు గుర్తుంచుకునే విషయాలు. ఇలాంటి ఆటగాడిని కులం ఆధారంగా తప్పించారన్న ఆరోపణలు క్రికెట్ ప్రేమికుల మధ్య కూడా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి తప్పించడం ఒక సాధారణ క్రికెట్ నిర్ణయంగా మిగిలిపోవాల్సింది. కానీ ఎస్పీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా చేసిన ఆరోపణలు దీన్ని కులం, రాజకీయాలు, వివక్ష అనే వివాదంగా మార్చేశాయి. ఈ సంఘటన క్రికెట్ను రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం సరైన విధానమా అన్న ప్రశ్నను దేశవ్యాప్తంగా రేకెత్తిస్తోంది.

