Team India coach
Team India coach టి20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తవుతుంది.. ఇప్పటికే హెడ్ కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ ప్రకటన చేసింది. ఈ ప్రకారం త్వరలో భారత జట్టుకు కొత్త వస్తాడు. ఇందుకోసం దరఖాస్తులను బీసీసీఐ స్వీకరించింది. సోషల్ మీడియాలో, మీడియాలో పలువురి పేర్లు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. కొంతమంది తో బిసిసిఐ సెక్రటరీ జై షా సంప్రదింపులు కూడా జరిపారని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ నిరాధారమని బీసీసీఐ కొట్టి పారేసింది.
ఇటీవల ఐపీఎల్ ఫైనల్ లో కోల్ కతా జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడోసారి ట్రోఫీని అందుకుంది. ట్రోఫీని విజేత జట్టుకు బహూకరించే కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జై షా హాజరయ్యారు. ఆ సందర్భంలో కోల్ కతా జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలను క్యాజువల్ కోణంలోనే చాలామంది చూశారు.. అయితే వాటి వెనుక అసలు కథ వేరే ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఎందుకంటే కోల్ కతా జట్టును, అంతకుముందు లక్నో జట్టును రెండుసార్లు గౌతమ్ గంభీర్ విజయ పథంలో నడిపాడు. దురదృష్టవశాత్తు లక్నో జట్టు గత రెండు సీజన్లో ప్లే ఆఫ్ వద్దే తన కథను ముగించింది. కోల్ కతా జట్టు మాత్రం అంతకుమించి అనేలాగా ఈ సీజన్లో ఆడింది. ఏకంగా కప్ దక్కించుకుంది. కోల్ కతా జట్టును సమూలంగా మార్చిన ఘనత గౌతమ్ గంభీర్ కే దక్కుతుంది. అతని నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా కోచ్ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు ముగిసింది. అయితే ఈ పదవి కోసం గంభీర్ దరఖాస్తు చేశాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వెళ్తాడని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమాని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. కోచ్ పదవికి సంబంధించి గౌతమ్ గంభీర్ కు జై షా ఒక స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వేరు పడుతుందని అందరూ భావిస్తున్నారు.
టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ వెళ్తాడని..కోల్ కతా జట్టు ఓనర్ షారుక్ ఖాన్ కు కూడా తెలుసని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ వెల్లడించింది. ” మొత్తానికైతే ఏదో జరుగుతోంది.. షారుక్ ఖాన్ సానుకూల సంకేతాలు ఇచ్చారు. జై షా కూడా దాదాపుగా మంతనాలు పూర్తి చేశారు. త్వరలో ఏదైనా జరగొచ్చు. అందుకు సిద్ధంగా ఉండండి” అంటూ క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది.