Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కి పాక్ కు టీమిండియా.. అమిత్ షా ఏం చెప్పారంటే…

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు మొదలుపెట్టింది. మైదానాలను సిద్ధం చేస్తోంది. అందులో మౌలిక వసతులు కల్పిస్తోంది. మైదానాలకు మరమ్మతుల నేపథ్యంలోనే ఇటీవలి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ రావల్పిండి లో నిర్వహించింది..

Written By: Anabothula Bhaskar, Updated On : September 10, 2024 3:02 pm

Champions Trophy

Follow us on

Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు పాకిస్తాన్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే భారత జట్టు పాకిస్తాన్ వెళ్లే విషయంపై బీసీసీఐ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం సమ్మతం తెలిపితేనే టీమ్ ఇండియాను పాకిస్తాన్ పంపిస్తామని వెల్లడించింది. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్ ట్రోఫీ ఆడే విషయంలో భారత జట్టును ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్ పంపించే అవకాశం లేదని పేర్కొన్నారు.. గత శుక్రవారం అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో త్వరలో జరగబోయే ఎన్నికలను పురస్కరించుకొని భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ చేపడుతున్న కవ్వింపు చర్యలను ఎండగట్టారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేంతవరకు.. ఆ దేశంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ ఆడేందుకు అడుగుపెట్టదని స్పష్టం చేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ దేశంతో తాము చర్చలు నిర్వహించబోమని పేర్కొన్నారు.. జమ్మూ కాశ్మీర్ యువకుల అభిప్రాయాలను అర్థం చేసుకునేందుకు తమ ప్రయత్నిస్తున్నామని.. వారి ఆలోచనలకు అనుగుణంగానే తమ అడుగులు ఉంటాయని అమిత్ షా పేర్కొన్నారు.

భారత్ వైఖరిపై స్పష్టత వచ్చింది

అమిత్ షా పాకిస్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేందుకు భారత జట్టు దాయాది దేశానికి వెళ్లబోదని స్పష్టమైందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దేశంలోకి భారత్ అడుగుపెట్టే విషయమై బి సి సి ఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. భారత జట్టును పాకిస్తాన్ పంపే సంపూర్ణ నిర్ణయాధికారం భారత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నాడు. ఇక ప్రస్తుతం అమిత్ షా భారత ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఎట్టి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ లో అడుగుపెట్టబోదని.. ఇప్పట్లో ఆ అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. రెండు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలో.. భారత జట్టును పాకిస్తాన్ పంపించకపోవడం అంత మంచిది కాదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భారత్ ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాలని వారు సూచిస్తున్నారు. భారత్ ఆడకుంటే చాంపియన్స్ ట్రోఫీ పూర్తిగా కళ తప్పుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.