Vata Savitri Vratam 2026 date: హిందూ సంప్రదాయంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాల్లో వట సావిత్రి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని సౌభాగ్యం, భర్త దీర్ఘాయుష్షు, కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత మహిళలు పాటిస్తారు. వట వృక్షం (మర్రిచెట్టు) చుట్టూ పూజలు నిర్వహిస్తూ సావిత్రి దేవిని స్మరించడం ఈ వ్రత ప్రత్యేకత. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఏడాది ఈ వ్రతం ఎప్పుడు చేయాలి?
సంప్రదాయం ప్రకారం.. వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య లేదా జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి రెండుసార్లు కూడా ఈ వ్రతాన్ని నిర్వహించే ఆనవాయితీ ఉంది. మొదటిసారి వైశాఖ అమావాస్య రోజున, అంటే 2026 మే 16 శనివారం ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తున్నారు. రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి రోజున అంటే జూన్ 29న ఈ వ్రతాన్ని పాటించనున్నారు. ప్రాంతానుసారం తిథుల్లో తేడాలు ఉన్నా వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మాత్రం ఒకటే.
వట సావిత్రి వ్రతానికి మూలం మహాభారత కాలంలోని సావిత్రి –సత్యవాన్ కథ. సావిత్రి తన భర్త సత్యవాన్ ప్రాణాలను యమధర్మరాజు నుంచి తిరిగి పొందిన ఘట్టం ఈ వ్రతానికి ఆధారం. అపారమైన భక్తి, పట్టుదల, పతివ్రత్య మహిమతో సావిత్రి యముడినే ఒప్పించి తన భర్తను తిరిగి జీవింపజేసిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహిత మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతాన్ని ఎంతో విశ్వాసంతో ఆచరిస్తారు.
వట వృక్షాన్ని ఈ వ్రతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. మర్రిచెట్టు దీర్ఘాయుష్షుకు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. వృక్షం వేర్లు బ్రహ్మను, తొర్ర విష్ణువును, కొమ్మలు శివుడిని సూచిస్తాయని పురాణ విశ్వాసం. అందువల్ల వట వృక్షాన్ని ప్రదక్షిణలు చేస్తూ పూజించడం ద్వారా త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఈ వ్రతం రోజున మహిళలు తెల్లవారుజామునే స్నానం చేసి పసుపు, కుంకుమ, పూలతో పూజకు సిద్ధమవుతారు. కొత్త బట్టలు ధరించి, చేతులకు గాజులు, మంగళసూత్రంతో సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. అనంతరం వట వృక్షం వద్దకు వెళ్లి దీపారాధన చేసి, చెట్టు చుట్టూ పవిత్ర దారాన్ని చుట్టుతూ ప్రదక్షిణలు చేస్తారు. సావిత్రి – సత్యవాన్ కథను శ్రద్ధగా వింటారు లేదా చదువుతారు.
వట సావిత్రి వ్రతంలో ఉపవాసానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కొందరు మహిళలు రోజు మొత్తం నిరాహారంగా ఉంటే, మరికొందరు ఫలాహారం మాత్రమే తీసుకుంటారు. ఉపవాసంతో పాటు భక్తి, నియమ నిష్ఠలతో పూజలు చేస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం.
ప్రస్తుతం కూడా ఉత్తర భారతదేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక మహిళలు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. ఆధునిక జీవనశైలిలోనూ సంప్రదాయాలను కొనసాగిస్తూ కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఆచారంగా వట సావిత్రి వ్రతం నిలుస్తోంది. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, భార్యాభర్తల అనుబంధం, నమ్మకం, కుటుంబ విలువలకు ప్రతీకగా భావించబడుతోంది.
