Varalakshmi Vratham 2025: శ్రావణమాసం ప్రారంభం కాగానే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు, పండుగలు ఉంటాయి. శ్రావణమాసం రెండో వారంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు జరుపుకునే విశేషమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. ఇల్లు సంతోషంగా ఉండడానికి.. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి.. ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో లేకుండా చేయడానికి వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తారు. మహిళలు ప్రత్యేకంగా నిర్వహించే ఈ వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది 2025 ఆగస్టు 8వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతం చేయాలని కొందరికి ఆసక్తి ఉన్నా.. ఎలా చేయాలో అవగాహన ఉండదు. అంతేకాకుండా ఈ వ్రతంలో కొన్ని తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ వ్రతం నిర్వహించేవారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు చూద్దాం..
Also Read: కెనడాలో ఖలిస్తాన్ రిపబ్లిక్ రాయబార కార్యాలయమాట?
శ్రావణమాసం శుక్లపక్షంలో చివరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతంను నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2025 ఆగస్టు 8న ఉదయం 6.42 నుంచి 8.47 వరకు సింహ లగ్నం ముహూర్తం ఉంటుంది. వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 3.47 గంటల వరకు ఉంటుంది. కుంభ లగ్నం సాయంత్రం 7.11 గంటల నుంచి 8.50 గంటల వరకు ఉంటుంది. సాధారణంగా మహిళలు ఉదయం సింహ లగ్నంలోని వ్రతంలో నిర్వహించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే సమీపంలోని పండితులను కలిసి వారి జాతకం ప్రకారం ఏ సమయంలో వ్రతం నిర్వహించాలో తెలుసుకొని వ్రతం నిర్వహించుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం నిర్వహించాలని అనుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇంటిని.. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు సంబంధించిన సామాగ్రిని ముందే ఒకరోజు తీసుకొని రావాలి. ఇప్పుడు పూజ సామాగ్రిని సిద్ధం చేసుకుని.. అమ్మవారితో సహా పీఠంను ఏర్పాటు చేసుకోవాలి. ఇత్తడి లేదా వెండి పాత్రలను ఏర్పాటు చేసుకొని అందులో బియ్యం పోయాలి. దానిపై బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కలశం ఏర్పాటు చేసుకోవాలి. దీనితోపాటు కొబ్బరికాయ ఇతర పూజ సామాగ్రిని ఉంచాలి. అమ్మవారి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఈ కలశం ముందు ఏర్పాటు చేసుకొని పూజా విధానం పాటించాలి. ముందుగా గణపతి పూజ.. పుణ్యహవాసనం, ఆ తర్వాత కలశపూజ నిర్వహించాలి. చివరగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి పూజా విధానాన్ని ముగించాలి.
వరలక్ష్మీ వ్రతం నిర్వహించేవారు మహిళలు నిష్టతో ఉపవాసం ఉండాలి. ఈరోజు పరుషంగా మాట్లాడకుండా ప్రయత్నించాలి. మనసులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పూజ ముగించుకోవాలి. సాధ్యమైనంతవరకు ఉదయమే పూజ ముగిస్తే ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించే పూజగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి అదనపు చెత్త చెదారం లేకుండా ఉండాలి. ఈరోజు ఎలాంటి విషయాలు మర్చిపోకుండా అన్ని వస్తువులు దగ్గరే ఉంచుకొని పూజ నిర్వహించాలి.
వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసిన తర్వాత మహిళలు ఒకరికి ఒకరు వాయినాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో కుళ్లిపోయిన పండ్లు లేదా పాడైపోయిన తమలాపాకులు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ఇలా చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది.