Tirumala
Tirumala: వేసవి సెలవుల్లో తిరుపతి వెళుతున్నారా? తిరుమలలో స్వామివారి దర్శనానికి ప్లాన్ చేశారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్వామి వారి భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విశాఖ బెంగుళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు ఈ ప్రత్యేక రైళ్ళు నడవనున్నాయి. ప్రతి శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖలో బయలుదేరే ఈ రైలు.. మర్నాడు ఉదయం ఏడున్నర గంటలకు బెంగుళూరు చేరుకోనుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయలుదేరి.. మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకు విశాఖ చేరుకొనుంది.
సాధారణంగా వేసవి సెలవుల్లో తిరుమల వెళ్లేందుకు ఎక్కువమంది ప్లాన్ చేసుకుంటారు. అందుకే ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖ నుంచి ప్రారంభమయ్యే రైలు.. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లో ఆగనుంది. రేణిగుంట స్టాప్ ఉండడంతో తిరుమల భక్తులకు ప్రయాణం సునాయాసం కానుంది. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
వేసవి దృష్ట్యా దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనుంది. గత ఏడాది వేసవిలో 6,369 ట్రిప్పులు నడపగా.. ఈసారి దానిని 9111 ట్రిప్పులకు పెంచినట్లు రైల్వే శాఖ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,012 ట్రిప్పులు నడవనున్నాయి. ప్రధానంగా ఏపీ, తెలంగాణ,తమిళనాడు, యూపీ,రాజస్థాన్, ఢిల్లీ,మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.