కోవిద్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్ డౌన్5.0 పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగో దశ లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదో దశ లాక్ డౌన్ పొడగింపుపై వివిధ రకాల ఊహాగానాలు వినొస్తున్నాయి. దీనిపై కేంద్ర వర్గాలు స్పందిస్తూ, లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడగించే అవకాశాలు ఉన్నాయని సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జరిగే మన్ కీ బాద్ కార్యక్రమలో స్పష్టతనిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, లాక్ డౌన్ సమయంలో ఆంక్షలు విధింపు, సడలింపులపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్రం దశలవారీగా లాక్ డౌన్ ను పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాలుగు విడుతలు లాక్ డౌన్ అమలు చేసినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడమే కాకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5వ విడుత లాక్ డౌన్ లో ప్రధానంగా కేసులు పెరిగే ప్రాంతాలపై కేంద్రం దృష్టిసారించనుంది.
దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో కేవలం 11 నగరాల్లోనే 70 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల జాబితాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, పుణె, థానె, ఇండోర్, జైపూర్, సూరత్ ఉన్నాయి. ఈ 11 నగరాల్లో కేసులను నియంత్రించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 5వ విడుత లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించే అవకాశముందని తెలుస్తుంది.