WTC ranks : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)ట్రోఫీ ఇప్పటి వరకు భారత్కు అందని ద్రాక్షగానే ఉంది. వరుసగా రెండు సీజన్లలో ఫైనల్కు చేరినప్పటికీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. మూడో సీజన్లో అయినా ఛాంపియన్గా నిలవాలని టీమిండియ పట్టుదలతో ఉంది. ఈమేరు కొత్త సీజన్ను అందుకు అనుగుణంగా ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టులో ఓడినా.. రెండో టెస్టు నుంచి పుంజుకుంది. రాజ్కోట్లో జరిగిన మూడో మ్యాచ్ లో భారీ విక్టరీ కొట్టింది. దీంతో డబ్ల్యూటీసీ ర్యాంకులో మళ్లీ రెండోస్థానికి చేరుకుంది.
గతవారం పడిపోయిన ర్యాంకు..
గత వారం న్యూజిలాండ్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్లను గెలిచి డబ్ల్యూటీసీ ర్యాంకులో అగ్రస్థానం సొంతం చేసుకుంది. దీంతో అప్పటి వరకు మొదటిస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో ఉన్న భారత్ మూడో స్థానానికి దిగజారింది. అయితే తాజాగా రాజ్కోట్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీతో తాజాగా ఆస్ట్రేలయాను వెనక్కి నెట్టి రెండోస్థానానికి ఎగబాకింది.
ర్యాంకులు ఇలా..
2023-25 డబ్ల్యూటీసీ సిరీస్లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. మూడు మ్యాచ్లు గెలిచి 75 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ ఏడు మ్యాచ్లు ఆడింది. నాలుగింటిలో గెలిచింది. రెండు మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో 59.2 శాతం విజయాలతో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆస్ట్రేలియా 10 మ్యాచ్లు ఆడింది. ఆరు మ్యాచ్లలో గెలవగా, మూడు మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో 55 శాతం విజయాలతో మూడోస్థానంలో నిలిచింది. తర్వాత బంగ్లాదేశ్(50), పాకిస్తాన్(36.66), వెస్టిండీస్(33.33), దక్షిణాఫ్రికా(25) శాతం విజయాలతో వరుసగా 4, 5, 6, 7వ స్థానాల్లో ఉన్నాయి. భారత్లో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ కేవలం 21 శాతం విజయాలతో 8వ స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక అట్టడుగున నిలిచింది.