Nara Brahmani: బ్రాహ్మణికి టిడిపి పగ్గాలు?

ప్రస్తుతం నారా బ్రాహ్మణి రాజమండ్రి లోనే ఉంటూ మామ చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టిగానే పోరాడుతున్నారు. మీడియా సమావేశాల్లో సైతం తన వాణిని గట్టిగానే వినిపిస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 18, 2023 9:08 am

Nara Brahmani

Follow us on

Nara Brahmani: తెలుగుదేశం పార్టీకి నారా బ్రాహ్మణి సారధ్యం వహించనున్నారా? తాజా పరిస్థితుల్లో ఆమె బాధ్యతలు తీసుకోవడం తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వారం రోజుల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళవారం కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. మిగతా కేసులు నమోదు చేసి మళ్ళీ రిమాండ్ కు పంపాలన్నదే జగన్ సర్కార్ ప్లాన్. టిడిపి ధైర్యాన్ని దెబ్బతీయాలన్నదే వ్యూహం.

అటు నారా లోకేష్ ని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం అంటూ.. పాత కేసును బయటకు తీసే పనిలో సిఐడి ఉంది. ఫైబర్ గ్రిడ్ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు తిరగ దోడేందుకు సిఐడి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసిన సిఐడి.. రెండేళ్ల కిందటే కేసును నిలిపివేసింది. ఇప్పుడు లోకేష్ ను ఎలాగైనా అరెస్టు చేయాలన్న కోణంలో కేసును రీఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు లోకేష్ ను సైతం అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తామని వైసిపి నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ భారీ వ్యూహానికి తెరతీసింది.

ప్రస్తుతం నారా బ్రాహ్మణి రాజమండ్రి లోనే ఉంటూ మామ చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టిగానే పోరాడుతున్నారు. మీడియా సమావేశాల్లో సైతం తన వాణిని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇప్పటివరకు హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల్లో మాత్రమే బ్రాహ్మణి కనిపించేవారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ జైలు పాలైతే పార్టీ బాధ్యతలను ఆమె స్వీకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందమూరి వారసురాలుగా, నారావారి కోడలుగా ఇప్పుడు పార్టీని నడిపించే గురుతుర బాధ్యత ఆమెపై పడింది. సమకాలిన రాజకీయ అంశాలపై ఇప్పటికీ ఆమెకు మంచి అవగాహన ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణి సేవలను సైతం వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకే ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే.. ఎన్నికల నాటికి కుదురుకుంటారని సీనియర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో లోకేష్ ఉన్నారు. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి పరిస్థితి వస్తే బ్రాహ్మణిని కీలక బాధ్యతలు అప్పగించి టిడిపి శ్రేణుల్లో ధైర్యం పెంపొందించేందుకు.. ప్లాన్ బి అమలు చేస్తారని టాక్ నడుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర తాత్కాలికంగా విరమించిన సంగతి తెలిసిందే. దానిని బ్రాహ్మణితో పూర్తి చేయించడానికి సైతం సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తాజా పరిస్థితులు నేపథ్యంలో నారావారి ఇంటి నుంచి నందమూరి కుటుంబ సభ్యుల చేతిలోకి పార్టీ పగ్గాలు రానున్నాయి.