Earthquakes: మన గోదావరి పరివాహకానికి ‘భూకంపాల ముప్పు’.. హైదరాబాద్ పరిస్థితి ఇదీ

భూకంపాల జోన్లో గోదావరి పరివాహకాన్ని నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ గతంలోనే ప్రకటించింది. చెప్పినట్లుగానే వరుస ప్రకంపనలు తీరప్రాంత ప్రజలను, జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 26, 2023 4:01 pm

Earthquakes

Follow us on

Earthquakes: ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. మనం చేస్తున్న తప్పులతో ప్రకృతి ప్రకోపిస్తోంది. దీంతో కరువులు, వానలు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సునామీలు పెరుగుతున్నాయి. తాజాగా వరంగల్‌ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడెక్కడ భూకంపాలు సంభవిస్తాయి. ఏయే ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి అన్న అంశంపై చర్చ మొదలైంది.

గోదావరి తీరంలో…
భూకంపాల జోన్లో గోదావరి పరివాహకాన్ని నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ గతంలోనే ప్రకటించింది. చెప్పినట్లుగానే వరుస ప్రకంపనలు తీరప్రాంత ప్రజలను, జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. 1869 నుంచి 2022 వరకు ఏకంగా 25 సార్లు గోదావరి తీరంలో భూకంపాలు రావడం గమనార్హం. ఇందుకు భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణమని ఎన్టీఆర్‌ఐ వెల్లడించింది. గోదావరి అడుగు భాగాన హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి గోదావరి ప్రాంతంలో గ్రాబెన్‌ నిర్మాణం ఉంది. దీనివల్ల భూమిపై పొరలు మాత్రమే కంపిస్తాయి.

మూడో రీజియన్‌లో గోదావరి తీరం..
గోదావరి రీజియన్‌ను భూకంప ప్రాంతాల్లో 3వ రీజియన్‌ చేర్చారు. ఈ ప్రాంతంలో వచ్చే భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం ఉండదు. 1869 నుంచి వచ్చిన భూకంపాలను పరిశీలిస్తే 2 నుంచి 5 లోపే రిక్టర్‌ స్కేల్‌ పై నమోదు అవుతోంది.

151 ఏళ్లలో 25 సార్లు..
1869 నుంచి 2020 వరకు 151 ఏళలో ఇప్పటివరకు గోదావరి పరివాహక ప్రాంతంలో 25 సార్లు భూమి కంపించింది. 1869లో కాకినాడ కేంద్రంగా 4.3 మాగ్నిటూడ్స్‌ నమోదైంది. 1872లో బెల్లంపల్లి (సిరొంచ) కేంద్రంగా 4.5, 1898లో కాకినాడ కేంద్రంగా 4.1, 1954లో కొత్తగూడెం కేంద్రంగా 4.1, 1963లో ఖమ్మం కేంద్రంగా 5.0, 1968లో భద్రాచలం–కొత్తగూడెం మధ్యన 4.5,1968లో భద్రాచలం–చర్ల మధ్య 5.3, 1969లో భద్రాచలం కేంద్రంగా 4.6, 1972లో మహబూబ్‌ బాద్‌ కేంద్రంగా 2.9, 1975లో కాజీపేట–మేడికొండ మధ్య 3.3, 1975లో కరీంనగర్‌ కేంద్రంగా 3.2, 1976లో వైరూర్‌ కేంద్రంగా 2.7, 1976లోనే వైరూర్‌ కేంద్రంగా రెండోసారి 2.8 1978లో ఇల్లెందులపాడు కేంద్రంగా 3.8, 1980లో ఇస్మాబాద్‌ కేంద్రంగా 2.9, రెండోసారి రంపచోడవరం కేంద్రంగా 4.3, మూడోసారి రంపచోడవరం కేంద్రంగా 3.8, 1983లో బెల్లంపల్లి కేంద్రంగా 3.8, 1984లో బెల్లంపల్లి కేంద్రంగా 3.5, 1991లో బెల్లంపల్లి కేంద్రంగా 3.6, 2004లో కొత్తగూడెం–భద్రాచలం మధ్య 3.0, 2009లో పాల్వంచ – ఇల్లెందు మధ్య 2.7, 2018లో పాల్వంచకు భూమి లోపల 15 కిలోమీటర్ల కేంద్రంగా 4.0, రెండోసారి 2.0, తాజాగా 2020లో పాల్వంచ కేంద్రంగానే 2.20 మాగ్నిటూడ్స్‌ నమోదైంది.

హైదరాబాద్‌ సేఫ్‌..
తెలుగు రాష్ట్రాలు భూకంపాలు తక్కువగా సంభవించే సెస్మిక్‌ జోన్‌ 2, 3ల్లో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు జోన్‌–2లో ఉన్నాయి. ఇక్కడ భూకంపం వచ్చే అవకాశాలు తక్కువ. తెలంగాణలోని మూడొంతుల భూభాగం కూడా ఈ జోన్ లోనే ఉంది. రాయలసీమలో చిత్తూరు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మిగతా ప్రాంతం మొత్తం జోన్‌–2లో ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా జోన్‌–2లోనే ఉన్నాయి.