Homeక్రీడలుIPL Vs Saudi Arabia: ఐపీఎల్ పై సౌదీ కన్ను: ఇంతకీ ఆ గల్ఫ్ దేశం...

IPL Vs Saudi Arabia: ఐపీఎల్ పై సౌదీ కన్ను: ఇంతకీ ఆ గల్ఫ్ దేశం ఏం చేస్తోందంటే?

IPL Vs Saudi Arabia: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ లీగ్. గత 17 సంవత్సరాలుగా ఈ టోర్నీ విజయవంతంగా సాగుతోంది. భారత క్రికెట్ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు.. ఈ టోర్నీ ద్వారా భారత క్రికెట్ సమాఖ్య భారీగా ఆదాయాన్ని వెనకేసుకుంది. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా భారత ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే గత ఏడాది కోవిడ్ నిబంధనల వల్ల టోర్నీని దుబాయిలో నిర్వహించాల్సి వచ్చింది. అక్కడికి కూడా మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడంతో అక్కడి ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. అయితే దానిని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై కన్నేసింది.

ఏం చేయబోతోంది అంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ధనికమంతమైన క్రికెట్ లీగ్. పైగా ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ మెగా లీగ్ కు కూడా ఆదరణ అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే దీనికి సౌదీ అరేబియా నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశం ప్రపంచంలోనే ధనికవంతమైన క్రికెట్ లీగ్ ప్రారంభించే యోచనలో ఉంది.

భారీగా పెట్టుబడి

ఇప్పటికే సౌదీ అరేబియా ప్రభుత్వం ఫార్ములా 1,ఫుట్ బాల్ వంటి వాటిపై భారీగా పెట్టుబడులు పెట్టింది.. ఇప్పుడు తాజాగా క్రికెట్ వైపు చూస్తోంది. అంతేకాదు అత్యంత ధనికవంతమైన క్రికెట్ లీగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు సంబంధించి ఐపిఎల్ నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే విదేశీ లీగ్ లలో భారత ఆటగాళ్లు ఆడటంపై బీసీసీఐ నిషేధం విధించింది. ఒకవేళ సౌదీ అరేబియా సొంతంగా టి20 లీగ్ ప్రారంభిస్తే బీసీసీఐ ఆధ్వర్యంలో మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈమధ్య ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే కూడా క్రికెట్ పై సౌదీ అరేబియాకు ఉన్న ఆసక్తి గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.”ప్రపంచంలోనే అత్యంత ధనికమంతమైన క్రికెట్ లీగ్ ప్రారంభించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆలోచిస్తోంది.. దీనికోసం భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ నిర్వహకులతో కూడా మాట్లాడుతోంది. ఇప్పటికైతే ఏమీ చెప్పలేము కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంచనా వేయలేమని” ఆయన వివరించారు.

గొప్పగా మార్చాలని

సౌదీ అరేబియాను గొప్ప క్రికెట్ వేదికగా మార్చాలన్నదే తమ లక్ష్యమని అక్కడి క్రికెట్ ఫెడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌత్ బిన్ మిషాల్ అల్ సౌదీ చెబుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న “సౌదీ క్రికెట్” లీగ్ లోకి అడుగుపెడితే అది ఖచ్చితంగా ఐపిఎల్ కు పోటీ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే సౌదీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇండియాలో జరుగుతున్న క్రికెట్ పోటీలను చాలా నిశితంగా గమనిస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ ఓనర్లతో పాటు బీసీసీఐ ని కూడా తమ టి20 లీగ్ లో భాగస్వాములు చేయాలని ప్రయత్నిస్తున్నారు. టి20 లీగ్ అనే కాదు ప్రతి ఏడాది ఆసియా కప్ లేదంటే ఓ రౌండ్ ఐపిఎల్ మ్యాచ్ లను కూడా సౌదీలో నిర్వహించడం లాంటి ప్రతిపాదనలు కూడా వాళ్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఏం ఉపయోగం?

క్రికెట్ లీగ్ నిర్వహించడం ద్వారా సౌదీ అరేబియా పర్యాటకంగా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇటీవల ఖతార్ దేశంలో ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. దీని కోసం ఆ దేశం ప్రత్యేకంగా మైదానాలు నిర్మించింది. ముస్లిం దేశం అయినప్పటికీ పర్యాటకుల విషయంలో సడలింపులు ఇచ్చింది. ఫలితంగా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు అదే బాటలో పయనించాలని సౌదీ అరేబియా భావిస్తోంది. ఇందులో భాగంగానే క్రికెట్ పై అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. ఇలాంటి లీగ్ లు నిర్వహించడం ద్వారా తమ దేశంలో స్థిరాస్తి వ్యాపారం కూడా జోరందుకుంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version