Pakistan Cricket Board: సమస్య లేదు. భూతద్దం పెట్టి చూద్దామన్నా అందులో లోపాలు లేవు. పైగా తటస్థ వేదికలో ఆడే అవకాశం.. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ.. ఏదో చేద్దామనుకొని.. భారీగా లబ్ది పొందాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కపటనాటకాలు మొదలుపెట్టింది. తన ప్రయోజనాలకు అనుగుణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ను తెరపైకి తీసుకువచ్చింది. బంగ్లాదేశ్ కు సంఘీభావం ప్రకటించింది. తటస్థ వేదికను కేటాయించిన తర్వాత కూడా టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి.. భారత్ తో జరిగే మ్యాచ్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.
అంతర్జాతీయంగా ఒత్తిడి రావడం.. ఐసీసీ తీవ్ర చర్యలకు ఉపక్రమిస్తుందని వార్తలు రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆత్మ రక్షణ ధోరణిలో పడింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు.. ఐసీసీ ప్రతినిధులతో కలిసి లాహోర్ ప్రాంతంలో మీటింగ్ పెట్టింది. ఈ మీటింగ్ లోనూ తర్కం లేని కోరికలు కోరింది. టి20 వరల్డ్ కప్ లో వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం కేటాయించాలని.. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో ట్రై సిరీస్ నిర్వహించాలని.. ప్రసార హక్కుల ద్వారా వచ్చే నగదులోను వాటా ఇవ్వాలని కోరింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే అవకాశం లేదని ఐసిసి స్పష్టం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎందుకు భారత జట్టుతో ఆడకూడదని చెప్పిందో తెలుసుకోవడానికి తాము లాహోర్ దాకా వచ్చామని icc ప్రతినిధులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురి కావడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వంతయింది. అయితే ఐసీసీ ట్రై సిరీస్.. ఇతర వ్యవహారాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు గానీ.. ఇప్పటికైతే పాకిస్తాన్ కోరిన ఏ కోరిక కూడా నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు భారత్ తో జరిగే మ్యాచ్ లో ఆడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తారని సమాచారం. ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆడేందుకు ఒప్పుకున్నప్పటికీ.. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆమోదం తెలిపితేనే భారత జట్టుతో జరిగే మ్యాచ్ సాకారం అవుతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి పై ఆగ్రహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. క్రికెట్లో ప్రధానమంత్రి జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓకే చెప్పినప్పటికీ ప్రధానమంత్రి ఆమోదం తెలపాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరే అంత.. కొండకు, బోడి గుండుకు ముడి పెడుతుందని.. విమర్శిస్తున్నారు.
భారత్ పాకిస్తాన్ తో ఆడకూడదని నిర్ణయించుకోవడానికి బలమైన కారణం ఉంది. పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని అనుకోవడానికి కూడా బలమైన నేపథ్యం ఉంది. కానీ పాకిస్తాన్ భారత జట్టుతో మ్యాచ్ ఆడక పోవడానికి స్పష్టమైన కారణం లేదు. పైగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తటస్థ వేదికలోనే పాకిస్తాన్ జట్టుతో తలపడింది. అలాంటప్పుడు పాకిస్తాన్ జట్టుకు వచ్చిన నొప్పి ఏంటో అర్థం కావడం లేదని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.