Munugode Bypoll- TRS Candidate: 2018 అసెంబ్లీ ఎన్నికల సమయం.. ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఐదేళ్లు పాలించిన తర్వాత కూడా కేసీఆర్ మొదటి దఫాలో టికెట్లు కేటాయించిన ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్స్ ఇచ్చాడు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు చాలా రోజుల ముందే టికెట్లు పంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజల్లోకి వెళ్లమని ఆదేశించాడు. ఆ ఊపులో టీఆర్ఎస్ నేతలు వెళ్లారు. మునుపటి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు.

ఏదైనా అనుకున్నాడంటే ఎంత వ్యతిరేకత ఉన్నా మొండిగా ముందుకెళ్లడం కేసీఆర్ కు అలవాటు.. అది సక్సెస్ లను కూడా 2018లో ఇచ్చింది. కానీ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వెలువడి ఈరోజు నామినేషన్లు వచ్చినా కూడా ఇప్పటివరకూ ఆగి మరీ కేసీఆర్ తాజాగా అభ్యర్థిని ప్రకటించాడు. ఎన్నో చర్చోపచర్చల తర్వాత మునుగోడు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. మునుగోడు టికెట్ కోసం పార్టీలోని సీనియర్ నేతలు ప్రయత్నించగా.. సుధీర్ఘ చర్చలు, సర్వేలు, రిపోర్టుల అనంతరం సీఎం కేసీఆర్ చివరకు ప్రభాకర్ రెడ్డికే మొగ్గుచూపింది. ఇంత జాప్యం చేయడానికి కారణం ఒకటే… అది ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ ’గా మార్పు. జాతీయ పార్టీగా మారక జరిగే తొలి ఎన్నికల్లో ఓటమి నైతికంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇంత కసరత్తు చేసి మరీ కేసీఆర్ అభ్యర్థిని ఆచితూచీ నిర్ణయించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేముందు తొలి అడుగు ‘మునుగోడు ఉప ఎన్నిక’ అందుకే ఇక్కడ గెలిస్తే పరువు దక్కుతుంది. ఓడితే బీఆర్ఎస్ కష్టమననిపిస్తుంది. అందుకనే ఇంత కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
Also Read: KCR BRS- Jagan And Chandrababu: కేసీఆర్ కొత్త పార్టీతో అలెర్ట్… జగన్, చంద్రబాబులు కీలక నిర్ణయం?
సొంత రాష్ట్రంలో గెలవని పెద్దమనిషి.. కేంద్రంలో ఎలా గెలుస్తాడన్న అపవాదు కేసీఆర్ కు పడుతుంది. అందుకే మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ లు అభ్యర్థిని ప్రకటించినా కేసీఆర్ ఇంకా ఇంత జాప్యం చేశారు. గెలుపు గుర్రం లాంటి క్యాండిడేట్ కోసం అన్వేషించారు. చివరకు ప్రభాకర్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నా కూడా అందరికంటే ఆయనే బెటర్ అని గ్రౌండ్ రిపోర్ట్ లో తేలడంతో అభ్యర్థిని ఖరారు చేశారు. కేసీఆర్ నామినేషన్లు రెడీ అయినా తర్వాత ఇంత ఆలోచించడం బహుషా పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు.

అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇటు కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఇద్దరూ రెడ్డీలే. ఇక టీఆర్ఎస్ కూడా రెడ్డి అయిన ప్రభాకర్ రెడ్డికి ఇచ్చేసింది. కాస్తంత వ్యతిరేకత ఉన్న ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ గెలిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
బీఆర్ఎస్ గా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేముందు తొలి టాస్క్ మునుగోడు. అందుకే ఇక్కడ గెలుపు కోసం తొలిసారి కేటీఆర్, హరీష్ లను రంగంలోకి దించారు. తనే మానిటరింగ్ చేస్తున్నాడు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపించారు. దీన్ని బట్టి మునుగోడు గెలుపు కేసీఆర్ బీఆర్ఎస్ ఆశలకు ఎంత ముఖ్యమో అర్థమవుతోంది.