Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: సొంత సామాజికవర్గమే చంద్రబాబును తిడుతోందా? కారణమేంటి?

Chandrababu: సొంత సామాజికవర్గమే చంద్రబాబును తిడుతోందా? కారణమేంటి?

Chandrababu: చంద్రబాబు సీఎంగా.. బలమైన నేతగా ఎదిగాడంటే ఆయన సొంత సామాజికవర్గం ‘కమ్మ’ల పాత్ర ఎనలేనిది. చంద్రబాబుకు ఆర్థికంగా.. సామాజికంగా ‘కమ్మ’లు అండదండలు అందించారు. అయితే ఇప్పుడు అదే కమ్మలు సరైన కారణంతో చంద్రబాబు నాయుడుని తిడుతున్నారట… టీడీపీ అధ్యక్షుడికి చాణక్యుడి తెలివితేటలు లేవని టీడీపీ కార్యకర్తలు కూడా వారితో కలిసి విమర్శలు చేస్తున్నారట.. అసలు చంద్రబాబును ఈ కమ్మ సామాజికవర్గం నేతలు ఎందుకు తిడుతున్నారు? అసలు కారణమేంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు ఎన్నో ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చొని పాలన సాగించారు. 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయంగా ఆయన వేసిన తప్పటడుగులు చరిత్రలో చంద్రబాబును లేకుండా చేశాయన్న అపవాదును మూటగట్టుకున్నారు. అదే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అధికారాన్ని పూర్తిగా స్వదినియోగం చేసుకున్నారనే చెప్పాలి.

తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించిన పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఏపీని విభజించాల్సి ఉన్నా చంద్రబాబు ఆ పనిచేయలేదు. జనాభా ప్రాతిపదికన, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఉన్నా చంద్రబాబు మాత్రం తన 13 జిల్లాలతోనే సరిపెట్టుకొని వాటితోనే లాక్కు వచ్చారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని విభజించి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఉంటే ఇప్పుడు కమ్మ సామాజికవర్గం లేదా టీడీపీ కార్యకర్తలకు ఈ అవమానం ఎదురయ్యేది కాదంటున్నారు.

ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కడం చంద్రబాబుకు తీరని అవమానంగా మారింది. టీడీపీ వ్యవస్థాపకుడి పేరును జగన్ వాడినట్టు కూడా చంద్రబాబు వాడుకోలేకపోయారన్న విమర్శ ఉంది.. ప్రతి జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం తప్ప ఆయనను గౌరవించేలా చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని.. ఈ ఉదంతం రాష్ట్రంలో టీడీపీ, కమ్మ సామాజికవర్గానికి చెంపపెట్టులాంటిదని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇన్నాళ్లుగా టీడీపీ అనుకూల మీడియా ఆయన్ను ప్రొజెక్ట్ చేసిందని.. అంత మాత్రాన చంద్రబాబు మేధావి కాదని ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆడిపోసుకుంటున్నారు… జగన్ పాలన చూశాక చంద్రబాబు గురించిన వాస్తవం బట్టబయలు అవుతోంది. చంద్రబాబు మీడియా మేడ్ మేనేజర్ అని..కానీ రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎలాంటి వ్యూహం లేకుండా చంద్రబాబు.. గత ఎన్నికల ముందు బీజేపీ కూటమి నుంచి బయటకు రావడం పెద్ద తప్పుగా అభివర్ణిస్తున్నారు. అదే చంద్రబాబు మూర్ఖత్వానికి నిదర్శనం అని సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయంలో చంద్రబాబును తప్పు పట్టడం లేదని.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ సొంతంగా ఆలోచించలేరని మాకు తెలుసు టీడీపీ సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఆయన మీడియా స్నేహితుల చేతిలో కీలుబొమ్మ మాత్రమేనంటున్నారు.. మీడియా అధినేతలు ఓడిపోయినప్పుడు.. చంద్రబాబు తన కుర్చీని కోల్పోతాడని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా జిల్లాల విభజన అన్నది చంద్రబాబు ఇమేజ్ ను బాగానే డ్యామేజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శల వాన కురుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version