Secunderabad Club: హైదరాబాద్ సంస్థానం ఘన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇన్నాళ్లు నిలిచిన ‘సికింద్రాబాద్ క్లబ్’ అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని సికింద్రాబాద్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు అంటుకొని పూర్తిగా తగలబడిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం తెల్లవారుజామన జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

-సికింద్రబాద్ క్లబ్ ప్రస్థానం..
1878లో బ్రిటీష్ హయాంలో సామంతరాజ్యంగా ‘హైదరాబాద్ సంస్థానం’ నిజాం రాజుల పాలనలో ఉండేది. ఈ క్రమంలోనే బ్రిటీష్ మిలటరీ అధికారుల కోసం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ ‘సికింద్రాబాద్ క్లబ్’ను నిర్మించారు. బ్రిటీష్ అధికారులను తప్ప వేరే వారిని ఈ క్లబ్ లోకి అనుమతించే వారు కాదు. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్ లో వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఎన్నో రకాల పక్షులకు ఇది ఆలవాలంగా ఉంది. సికింద్రాబాద్ క్లబ్ లో రూ.15 లక్షలు కడితేనే సభ్యత్వం లభిస్తుంది.

-నాడు బ్రిటీష్ అధికారులు, నిజాం రాజులకే సభ్యత్వం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకూ ఈ క్లబ్ అధ్యక్షుడిగా బ్రిటన్ పౌరులనే ఉంచేవారు. హైదరాబాద్ నిజాం రాజులకు సభ్యత్వం ఉండేది. ప్రస్తుతం 8వేల మంది ఆర్మీ, ప్రభుత్వ ,పోలీస్ అధికారులు, నిపుణులు, దౌత్యవేత్తలు, శాస్త్రవేత్తలు శాశ్వత సభ్యులుగా ఉన్నారు. 30వేల మంది సభ్యులున్నారు.

-అబ్బురపడే సౌకర్యాలు
నిజాం రాజు ఎన్నో సౌకర్యాలతో ఈ క్లబ్ ను కట్టించాడు. దాదాపు 5 స్టార్ హోటల్ లో ఉండే వసతులన్నీ ఈ క్లబ్ లో ఉంటాయి. క్రికెట్ మైదానం సహా ఇండోర్, అవుట్ డోర్ క్రీడలకు సంబంధించిన అన్ని సౌకర్యాలున్నాయి. బార్లు, డైనింగ్ హాల్స్, బాంకెట్ హాల్స్, పార్టీలు, సమావేశాలకు హాళ్లు, బయట పెద్ద అనేక పచ్చిక బయళ్లు ఉన్నాయి. సినిమాల ప్రదర్శనకు థియేటర్ ఉంది. ఫుడ్ కోర్టుసహా సకల సౌకర్యాలున్నాయి. ఎన్నో రకాల వంటకాలు ఇక్కడ సిద్ధం చేసి వండిస్తారు.

-వేడుకలకు క్లబ్ ఆతిథ్యం
నూతన సంవత్సరంతోపాటు ఎన్నో రకాల వేడుకలకు.. స్పాన్సర్ వేడుకలను క్లబ్ నిర్వాహకులు అనుమతిస్తారు. సామాజిక సమవేశాలు ఇక్కడ జరుగుతాయి.
ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ క్లబ్ అగ్నికి ఆహుతి కావడంపై అభిమానులు కలత చెందుతున్నారు. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఇది కాలిబూడిదవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



