Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: ఢిల్లీలో చంద్రబాబును పట్టించుకునే వారే లేరా?

Chandrababu: ఢిల్లీలో చంద్రబాబును పట్టించుకునే వారే లేరా?

Chandrababu: భర్త లేని వింతతువును, అధికారం లేని రాజకీయ నేతను ఎవరూ పట్టించుకోరన్న సామెత రాజకీయాల్లో ఉంది. ఒకప్పుడు ప్రధానులు, రాష్ట్రపతులను డిసైడ్ చేసినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును ఇప్పుడు ఢిల్లీలో అసలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడట.. వైసీపీ దాడులపై కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినా.. కేంద్రం పెద్దలకు మొరపెట్టుకున్నా అక్కడి నుంచి స్పందన కరువైందట.. చంద్రబాబుది ఢిల్లీలో ఒంటరి పోరాటమేనా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది.

chandrababu jagan
chandrababu jagan

ఏపీలో ఇటీవల ప్రతిపక్ష టీడీపీ నేతల కార్యాలయాలు, నేతలపై దాడులు జరిగాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు తీవ్రమైంది. సీఎం జగన్ పై టీడీపీ నేత కొమ్మునేని పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పట్టాభి ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. ఆ తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులతో పాటు పట్టాభి అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ఒకరోజు బంద్ కు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఈ వివాదం ఇంకా సమసి పోలేదు. దీంతో తెలుగుదేశం, వైసీపీకి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లారు.

చాలా రోజుల తరువాత ఢిల్లీకి వెళ్లబోతున్న చంద్రబాబుకు అనుకూల వాతావరణం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు ఢిల్లీలో అనుకూల పార్టీ ఒక్కటీ లేదు. ఢిల్లీ స్థాయిలో సన్నిహిత నేతలు అసలే లేరని తెలుస్తోంది. గతంలో ములాయం సింగ్ యాదవ్, మాయావతి, మమతా బెనర్జీ వంటి నేతలతో స్నేహం కొనసాగించిన బాబు ఆ తరువాత వారిని పక్కన బెట్టారు. దీంతో వారు కూడా బాబును పట్టించుకోవడం మరిచిపోయారు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తోనూ బాబుకు సరైన సంబంధాలు లేనట్లేనని సమాచారం.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన బాబుకు కలిసి రాలేదు. స్వయాన రాహుల్ గాంధీని రప్పించి ప్రచారం చేయించినా అధికారంలోకి రాలేకపోయారు. ఆ తరువాత ఆ పార్టీతో వెంటనే దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు అవసరానికి వాడుకొని ఆ తరువాత వదిలేస్తారనే పేరు వచ్చింది. దీంతో ఆయనతో కలిసుండడానికి ఏ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదు. దీంతో ఒంటరిగానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన బాబు ఆ తరువాత కమలం నాయకులతో వివాదాలు పెట్టుకున్నారు. ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేసి వారికి దూరమయ్యారు. ఇప్పుడు ఆ నాయకులను ప్రతిపక్ష హోదాలో కలవడం తప్ప బాబు సమస్యలను పట్టించుకునే నాథుడు లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ నాయకులతో బీజేపీ ముఖ్య నాయకుల అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుకు అవకాశం ఇస్తారా..? లేదా..? అన్నది సందిగ్ధంగానే మారిందని అంటున్నారు.

అటు వైసీపీ నాయకులు సైతం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ పయనమయ్యారు. అయితే వైసీపీ అధికారంలో ఉండడంతో పాటు అప్పుడప్పుడు మోదీతో సత్సంబంధాలు కొనసాగిస్తన్న వైసీపీ నాయకులు చంద్రబాబు కంటే ముందే అపాయింట్ మెంట్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అభివృద్ధి విషయాలను మరిచి ఇలాంటి విషయాలను కేంద్రం పట్టించుకుంటుందా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఏ పార్టీ తరుపున కేంద్రం కూడా సపోర్టు ఇచ్చే అవకాశాలు తక్కువేనని, అయితే ఇరు పార్టీల ఫిర్యాదులను తీసుకొని ఆ తరువాత సమయాన్ని పొడగించవచ్చని అంటున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై టీడీపీ, వైసీపీల తో పాటు బీజేపీ నాయకులు కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చని అంటున్నా ఆ పార్టీలో పెద్దగా అలజడి కనిపించడం లేదని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తమకే తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ స్థాయిలో ఏదో ఒక పార్టీ నాయకుల అండగా ఉండి ఉంటే ఇలాంటి సమయంలో సరైన న్యాయం జరిగేదే కదా.. అని కొందరు సలహాలు ఇస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version