Homeజాతీయ వార్తలుCM KCR  Paddy Issue: ఒక్క సంతకంతో రైతుల మెడకు ఉరి తాడు వేసిన కేసీఆర్‌

CM KCR  Paddy Issue: ఒక్క సంతకంతో రైతుల మెడకు ఉరి తాడు వేసిన కేసీఆర్‌

CM KCR Paddy Issue: రైతులు అన్యాయమైపోతున్నారు.. వారి ధాన్యం కేంద్రం కొనడం లేదన్న టీఆర్ఎస్ నేతల విమర్శలనే అందరూ చూస్తున్నారు. మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఈ కొనుగోళ్ల వెనుకున్న గోల్ మాల్ ఏంటన్నది మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. పొద్దున లేస్తే రైతులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని వరి ధాన్యం కొనుగోళ్లపై యాగీ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు నిజానికి వాళ్లే నిర్లక్ష్యం, అసమర్థత వల్లే ఈ దుస్థితి దాపురించిందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.. ‘తమది రైతు ప్రభుత్వం. రైతుల కోసం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సాగు పెట్టుబడికి ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఇచ్చాం. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా వర్తింపజేస్తున్నాం. రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.5 లక్షల ఆర్థికసాయం ఇస్తున్నాం’ ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలు పార్టీ మండల నాయకుల వరకు రైతుల గురించి చెప్పే గొప్ప ఆణిముత్యాలు.. చేసుకునే ప్రచారం బయట ఇదీ.. ఇందులో భాగంగానే రైతుబంధు ప్రారంభించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఏటా రైతులకు కేవలం రూ.10 వేలు ఇస్తూ.. మరో పదివేలు మిగుల్చుకుంటోంది. ఇదేలా అంటే.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, రొటోవేటర్లు, 20 నుంచి 30 శాతం సబ్సిడీతో అందేవి. డ్రిప్‌ పరికరాలు దళిత రైతులకు 90 శాతం సబ్సిడీ, మిగతా రైతులకు 70 శాతం సబ్సిడీతో అందేవి. ఇందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో ఏటా వ్యవసాయ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీలన్నీ ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. సబ్సిడీలన్నీ లెక్కగట్టిన సీఎం కేసీఆర్‌ రైతులను ఆకట్టుకునేందుకు ఆకర్షక పథకం రైతుబంధు రూపొందించారు. గుంట భూమి ఉన్న రైతు నుంచి వందల ఎకరాల ఉన్న భూస్వాములకూ రైతుబంధు ఇస్తున్నారు. దీంతో 90 శాతం ఉన్న పదెకరాల్లోపు రైతులకు అందే రైతుబంధు సొమ్ముకంటే పది శాతం మంది ఉన్న భూస్వామయ్య రైతులకు అధికంగా పెట్టుబడి అందుతోంది. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు, రైతులకు అర్థమవుతోంది.

CM KCR Paddy Issue
KCR

-రైతు వ్యతిరేక ముద్ర..

తమది రైతు ప్రభుత్వమని.. నేను కూడా స్వయంగా రైతునే అని సీఎం కేసీఆర్‌ చెప్పుకుంటారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు రైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతోనే రైతుల గురించి ఆలోచిస్తున్నాడని భజన చేస్తున్నారు. ఏ కార్యక్రమం జరిగినా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్లు రైతుబంధు, రైతుబీమా గురించే ప్రచారం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లే కేంద్రం కూడా రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం ఇస్తోంది. కానీ కేవలం 10 ఎకరాలలోపు ఉన్న రైతులకు దీనిని వర్తింపజేస్తోంది. పైగా కేంద్రం కిసాన్ సమ్మాన్‌ నిధి కోసం ఏ ఇతర సబ్సిడీ పథకాలను ఎత్తివేయలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంపై రెండేళ్లుగా రచ్చ చేస్తోంది. రైతులు పండించే ప్రతీ ధాన్యపు గింజను కొంటామని కేంద్రం, ఎఫ్‌సీఐ స్పష్టంగా చెబుతున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంట్‌ వేదికగా స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. రైతుల దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు వ్యతిరేకిగా ముద్ర పడే ప్రమాదం వచ్చింది. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన రైతు అనుకూల ప్రభుత్వం ముద్ర క్రమంగా చెదిరిపోతోంది.

Also Read: BJP Bandi Sanjay: ‘పాతబస్తీ’పై బీజేపీ వార్.. ఇరుకునపడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్?

-వందల్లో ఉన్న మిల్లర్ల కోసం.. కోట్ల మంది రైతులను పణంగా పెట్టిన కేసీఆర్?

రాష్ట్రంలో మొత్తంగా సుమారు 10 వేల వరకు రైస్‌ మిల్లులు ఉంటాయి. ఇందులో 70 శాతం పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులు కాగా, 30 శాతం రా రైస్‌ మిల్లులు. రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని మిల్లర్లు పారాబాయిల్డ్‌ రైస్‌గా మార్చి కేంద్రానికి విక్రయిస్తున్నారు. ఎఫ్‌సీఐ వద్ద పారాబాయిల్డ్‌ రైస్‌ నిల్వలు పెరిగిపోవడం, వీటికి ఎక్కువ రోజులు నిల్వ ఉండే గుణం లేకపోవడంతో కేంద్రం పారాబాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ ఈమేరకు లేఖ రాసింది. గత ఆగస్టులో నిర్వహించిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు ఇకపై యాసంగిలో తాము బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని లేఖ ఇచ్చారు. లేఖ ఇచ్చే ముందు ప్రభుత్వం రైతులను గానీ, రైతు సంఘాలను గానీ సంప్రదించలేదు. దీంతో ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది.

-వరి పోరు వెనుక రాజకీయం.. మిల్లర్ల ప్రయోజనాలే..

CM KCR Paddy Issue
KCR, MODI

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వరి రాజకీయం వెనుక కేవలం స్వ ప్రయోజనాలు, మిల్లర్ల ప్రయోజనాలు, తమపై జరిగే సీబీఐ, ఈడీ దాడులను తప్పించుకోవలన్న ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎప్పుడు ప్రెస్‌ మీట్‌ పెట్టినా కేసీఆర్‌ పదేపదే సీబీఐ, ఈడీ దాడులను ప్రస్తావించడం ఆయనకు లోపల ఉన్న భయాన్ని తెలియజేస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.. ఏ తప్పూ చేయలేదని చెబుతూనే లోలోన ఏదో ఆందోళన కనిపిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే లక్షల మంది రైతులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా తన మనుగడను కాపాడుకోవడంతోపాటు రేపు సీబీఐ, ఈడీ దాడులు జరిగినప్పుడు రైతుల కోసం తాను కొట్లాడుతుంటే కేంద్రం తనపై దాడులు చేయిస్తోందని ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని కేసీఆర్‌ కుటుంబం, ఆయన ప్రభుత్వం ఈ ప్లాన్ చేసినట్టు బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.

– 1965 నుంచి దేశవ్యాప్తంగా ఒకే కొనుగోలు విధానం..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా దేశమంతా ఒకే కొనుగోలు విధానం ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేసీఆర్‌ అడిగిండు కాబట్టి తాము అదే అనాలి అన్నట్లు ఆయన సహచరులూ అదే జపం చేస్తున్నారు. కానీ వాస్తవంగా 1965 నుంచి దేశమంతా ఒకే కొనుగోలు విధానం ఉంది. ఇప్పటి వరకు కొనుగోలు విధానంలో ఎలాంటి మార్పు చేయలేదు. 1965లో రూపొందించిన కొనుగోలు విధానం ప్రకారమే ఆయా రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం ఆధారంగా రైతులు పండించే పంటను ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తోంది. ఇటీవల బాయిల్డ్‌ రైస్‌ తినేవారి సంఖ్య తగ్గిపోవడం, పారాబాయిల్డ్‌ రైస్‌ ఎక్కువగా తినే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పారాబయిల్డ్‌ రైస్‌ నిల్వలు గోదాముల్లో పేరుకుపోతున్నాయి. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఎఫ్‌సీఐ గతేడాది అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించి పారాబాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఏ రాష్ట్రంలో సమస్య లేకుండా కొనుగోళ్లు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్రంలోనే సమస్య ఉత్పన్నమవుతోందన్న విమర్శలు రైతుల నుంచే వ్యక్తమువున్నాయి.

Also Read: NTR Emotional Letter: ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్.. ఎవరి గురించి ఏమి చెప్పాడంటే ?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version