chandrababu arrest12
Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో సిట్ కార్యాలయం నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. అప్పటికే భారీగా పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. మరోవైపు న్యాయవాదులు సైతం అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోపే కోర్టుకు తీసుకొచ్చినట్లు అయింది. అయితే కోర్టు ప్రాంగణంలో భారీగా టిడిపి శ్రేణులు చేరుకున్నాయి. వారిని నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది.
మరోవైపు ఏసీబీ కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. 2021 ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు చేర్చి కోర్టుకు సమర్పించింది. ఓపెన్ కోర్టులోనే వాదనలు వినాలన్న టిడిపి లీగల్ టీం విజ్ఞప్తికి న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా, సిఐడి తరఫున అదన పీఏజి వన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించనున్నారు. అయితే ఈ కేసులో చంద్రబాబును ఏ 37 గా చూపించడం విశేషం. మొత్తం 371 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అభియోగం మోపింది.
చంద్రబాబుకు రిమాండ్ విధించాలని సిఐడి పట్టుదలతో ఉంది. బలమైన వాదనలు వినిపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులైనా చంద్రబాబును జైల్లో ఉంచాలని భావిస్తోంది. కోర్టులో ఆమేరకు తీర్పు వస్తుందని భావిస్తుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ విధిస్తారని భావించి.. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. టిడిపి నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కాగా 15 రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ ఇవ్వాలని సిఐడి రిమాండ్ రిపోర్టులో కోరింది. సిఐడి డిఎస్పి ధనుంజయుడు పేరు మీద రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. మరికొద్ది గంటల్లో ఈ కేసునకు సంబంధించి తీర్పు వెలువడనుంది. దీంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.