Rythu Bandhu
Rythu Bandhu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నిల సంఘం రెండ రోజుల క్రితం అధికార బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చే విషయం చెప్పింది. రైతుబంధు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం రాష్ట్ర ఈసీకి రెండు పేజీల లేఖ పంపింది. దీంతో గులాపీ పార్టీ నెత్తిన పాలుపోసినట్లు అయింది. బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఇక ఓట్లు తమకే గుద్దుతారని గులాబీ బాస్ కేసీఆర్తోపాటు, మంత్రులు, కేటీఆర్, హరీశ్రావు ధీమాతో కనిపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఓ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి.. రైతుబంధు నిధుల విడుదలపై కసరత్తు చేశారు.
అనుమతిపై కాంగ్రెస్ అసంతృప్తి..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరుగా డబ్బుల పంపిణీకి ఈసీ ఎలా అనుమతి ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ–బీఆర్ఎస మైత్రికి ఇది నిదర్శనమని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తితో ఈసీ రైతుబంధు చెల్లింపులకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా మొదలు పెట్టారు.
కొంప ముంచిన హరీశ్రావు..
రైతుబంధు డబ్బుల చెల్లింపునకు ఈసీ ఇచ్చిన అనుమతి కేసీఆర్ అత్యుత్సాహంతో రద్దయిందని తెలుస్తోంది. కోడ్ అమలులో ఉండగా రైతుబంధుకు అనుమతిపై ఒకవైపు అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా, ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రెస్మీట్ పెట్టి ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. కొన్ని పత్రికల్లో ఈమేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. హరీశ్రావు ప్రెస్మీట్ వీడియో, పత్రికల్లో వార్తల క్లిప్పింగ్స్, కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనలు, బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్న వీడియోలు, ఫొటోలు కూడా ఫిర్యాదుకు జతపర్చింది.
కోడ్ ఉల్లంఘనగా పరిగణ..
వాస్తవంగా రైతుబంధుకు అనుమతి ఇచ్చిన సమయంలోనే ఈసీ స్పష్టమైన నిబంధనలు విధించింది. రైతుబంధు పంపిణీ చేస్తున్నట్లు ఎక్కడా మాట్లాడొద్దని, సంబరాలు చేసుకోవద్దని, ప్రకటనలు, ప్రెస్మీట్లు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిన ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది. కానీ ఆర్థిక మంత్రి హరీశ్రావు అత్యుత్సాహం మొదటికే మోసం తెచ్చింది. ప్రెస్మీట్ పెట్టడం, ప్రతికల్లో ప్రకటనలు ఇవ్వడం, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేయడాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. వీటిని కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తూ.. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతులను ఈసీ రద్దు చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కేంద్రం ఎన్నికల సంఘం రెండు పేజీల లేఖ పంపింది. ఇందులో కారణాలను స్పష్టంగా పేర్కొంది.
డబ్బులే లేవు..
వాస్తవంగా రైతుబంధు పంపిణీకి ప్రస్తుతం రూ.7,500 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వ ఖజానాలో రూ.4 వేల కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిధులు సమకూర్చడంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీఎం కేసీఆర్ సైతం అధికారులతో మాట్లాడారు. రూ.4 వేల కోట్లను చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. కానీ, ఇంతలోనే ఈసీ అనుమతులు రద్దు చేసింది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ రైతుబంధుకు సంబంధించిన తేదీలు ప్రకటించలేదు. అదేసమయంలో వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వలేదు. ప్రెస్మీట్లు పెట్టలేదు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో రైతుబంధు చెల్లిస్తూ వస్తోంది. కానీ, ఈసారి మాత్రం నవంబర్ 26 నుంచి 28 తేదీల్లో రైతుబంధు చెల్లిస్తామని అధికారికంగా ప్రకటించడం, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం బీఆర్ఎస ఆశలపై నీళ్లు చల్లింది.
ఈసీ నిర్ణయం పూర్తిగా బీఆర్ఎస్ స్వయంకృతాపారాధమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండి, ఈసీ నిబంధనలను కనీసం చదవకుండా అత్యుత్సాహం ప్రదర్శించడమే రైతుబంధు అనుమతుల రద్దుకు కారణమని పేర్కొంటున్నారు.