Homeఆంధ్రప్రదేశ్‌ABN RK Chandrababu : ఆంధ్రజ్యోతి ఆర్కే.. మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని కంకణం కట్టుకున్నాడే?

ABN RK Chandrababu : ఆంధ్రజ్యోతి ఆర్కే.. మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని కంకణం కట్టుకున్నాడే?

ABN RK Chandrababu : అధికారంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అని ఓ లోకోక్తి ఉంది. పాపం ఆ దారుణమైన చిత్రాలు చూడలేక.. ఆ అధికారం అడ్డు పెట్టుకుని పొందిన మేళ్లు ఇప్పుడు దక్కక ఆ రెండు పత్రికల్లో ఓ పత్రిక ఓనర్ రాధాకృష్ణ ఆగ్రహం అంతా ఇంతా కాదు. ఆ రెండు పత్రికలు కూడా బాబు క్యాంప్ వే. మొదటి వరుసలో ఈనాడు గార్నిష్ చేయకుండా వండుతుంది. రెండోది ప్యారడైజ్ టైప్. మసాలా బాగా పట్టిస్తుంది. ఇప్పుడున్న తెలుగు జర్నలిస్టులలో రాధాకృష్ణ టెంపర్ మెంట్ బాగుంటుంది. ఏది కూడా దాచుకోడు. కోపాన్ని, ప్రేమను అలాగే ఒలక పోస్తాడు. ప్రేమ బాబు మీద ఉంటే.. కోపం జగన్ మీద ఉంటుంది. ఆర్కే రాసే కొత్తపలుకు హాట్ హాట్ గా ఉంటుంది. ఒక్క బాబు అందులో జొర్రితే మాత్రం పోతరాజు మాదిరి చర్నా కోల్ తీసుకొని కొట్టుకుంటుంది. మొన్న కర్నూల్ లో జరిగిన ఓ మీటీంగ్ లో చంద్రబాబు ఇవే లాస్ట్ ఎన్నికలు అనడంతో రాధాకృష్ణ కు ఎక్కడా లేని ఉద్వేగం, ఉక్రోషం తన్నుకొచ్చాయి. వెంటనే ఈ దుర్మార్గ జగన్ ప్రభుత్వం కూలిపోవాలని శపించాడు. అంతే కాదు ఆదివారం రాసే కొత్త పలుకులో జగనా.. జనమా అని అల్టిమేటం ఇచ్చాడు. ఏది కావాలో తెల్చుకోవాలని పిలుపునిచ్చాడు.

 

-తేడా ఉంది

తాను ఊహించిన దానికంటే… ఆశించిన దాని కంటే వరస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయని ఆర్కే బాధ. ఆ అసహనం ఆయన రాతల్లో కనిపిస్తూనే ఉంటుంది. అవును జగన్ ప్రభుత్వం బాగోలేదు.. మరి అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేసింది ఎవరు? సింగపూర్ కంపెనీతో ఒప్పందం కుదురుచుకొని తర్వాత రద్దు చేసుకుంది ఎవరు? మొదట మూడేళ్లు కేంద్రంతో ప్రేమ నెరిపి.. ఆ తర్వాత మోది దుర్మార్గుడని, అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ళు వేయించింది నిజం కాదా? ఇప్పుడు కూసాలు మొత్తం విరిగాక బ్బా బ్భా బు గత తప్పుల్ని మన్నించమని మోడీ దగ్గరికి వెళ్లాలి అనుకుంటున్నది నిజం కాదా? ఇవన్నీ మరుగున పడేస్తే కాలగర్భంలో కలిసిపోయేవా? లేక ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి తీపి గుర్తులా? రాధాకృష్ణకు ఇవన్నీ గొప్పగా అనిపించవచ్చు. వీటిని చూసే ఏపి జనాలు యాక్ తూ ముఖం మీద ఉంచి 23 కు పరిమితం చేశారు. రాధాకృష్ణ చెబుతున్న చంద్రబాబు సువర్ణ పాలనలో ఒక మహిళా తహసిల్దార్ పై ఓ ఎమ్మెల్యే అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులను ఎలుకలు చంపేశాయి. గోదావరి పుష్కరాల్లో భక్తులు కన్ను మూసారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసిన ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని చెప్పిన రైతుల అరటి తోటలు నిలువునా కాలిపోయాయి. ఇవన్నీ చూసి.. వేసారి పోయి జనం ఒక ప్రత్యామ్నాయం కోరుకున్నారు. అప్పుడు వారికి జగన్ ఒక ఆశా దీపంలా కనిపించాడు. కానీ ఈ మూడేళ్లలో వారికి అసలు తత్వం బోధిపడుతోంది.

-చరమ గీతం పాడతారా?

ఆర్కే రాసినట్టు జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఎవరి సొత్తు కాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే పీఠాలు అధిష్టిస్తారు. ప్రజలు తిరస్కరిస్తే పీఠం అవతల నిలబడతారు. రాధాకృష్ణ వ్యాసం చూస్తే ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని దింపేసి బాబు ను ముఖ్యమంత్రి చేయాలి అది ప్రజలకు పిలుపునిచ్చినట్టుగా ఉంది. రంగులు వేసుకున్న పత్రికలు, వాటి యాజమాన్యాల రాజకీయ రంగులు తెలియనంత పిచ్చోళ్ళు ప్రజలు కాదు. జగన్ వద్దు అంటే బాబు ముఖ్యమంత్రి కావాలని కాదు. ప్రజలకు ఒక ఆప్షన్ ఉంది. అది పవన్ కళ్యాణ్ లేదా మరొకరు కావచ్చు. అయితే సైకిల్ లేదా ఫ్యాన్.. ఈ ఆప్షన్లు ప్రజల్లో మొనాటనీ తెచ్చాయి . ఆ మధ్య నారా భువనేశ్వరిని నానా మాటలు అన్నారని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాధాకృష్ణ కూడా కళ్ళు తుడుచుకున్నాడు. కానీ జనం అంతగా స్పందించలేదు. ఎందుకంటే బాబు రాజకీయాలు ఎలా ఉంటాయో వాళ్లు గత నాలుగు దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లో రాధాకృష్ణ తప్పులేదు. కానీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఏపీ ప్రజలు అనుకోవాలి. రెండింటికి చాలా తేడా ఉంది. కొత్త పలుకు రాసిన అంత ఈజీ కాదు ఓటు వేయడం. ఓట్లను మలుచుకోవడం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular