CM Chandrababu reduce convoy: పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు అంశాలపై పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇంధన పొదుపు పై కీలక సూచనలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రజలకు ప్రత్యేక సూచనలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ముందుగా తాము పొదుపు పాటించాలని భావించారు సీఎం చంద్రబాబు. తనతో పాటు మంత్రుల కాన్వాయ్ లో వాహన శ్రేణి తగ్గించారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం వేదికగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల దాకా తమ కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకోవడం కనిపించింది.
క్యాబినెట్ భేటీ..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ భేటీ జరిగింది. దాదాపు పదికి పైగా వాహనాలతో వచ్చే చంద్రబాబు కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే పరిమితం అయ్యారు. భద్రతా సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ సైతం తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. కేవలం రెండు వాహనాలతో వచ్చారు. సీఎం మాదిరిగా తన సెక్యూరిటీ సిబ్బంది కోసం ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సైతం తన కాన్వాయ్ ని తగ్గించుకున్నారు. జడ్ క్యాటగిరి లో ఉన్న దుబారా తగ్గించేందుకు వీలుగా పవన్ సగానికి పైగా వాహనాలను తగ్గించుకోవడం విశేషం.
ఒకే ఒక్క వాహనంలో వచ్చిన మంత్రులు
చివరికి హోం మంత్రి వంగలపూడి అనిత సైతం తన ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి తన వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. కొందరు మంత్రులు అయితే సింగిల్ వాహనంలో క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఎనిమిది పొదుపు అంశాలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా కీలక సూచనలు ఇవ్వగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆచరించి.. మిగతా వారికి చెబితే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు ప్రారంభం కావడం విశేషం.
















నాగబాబుపై తెగ బాధపడుతున్న రోజా
Roja comments on Nagababu: ఎందుకో మెగా ఫ్యామిలీ అంటే మాజీ మంత్రి రోజా విరుచుకుపడుతుంటారు. ఆమె వైసీపీ హయాంలో మంత్రి అయినప్పుడు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకునేందుకు వెళ్లారు. అంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు తో కలిసి బుల్లితెరలో జబర్దస్త్ షో చేశారు. ఎన్నెన్నో కార్యక్రమాల్లో వారిద్దరూ పాల్గొన్నారు. అయితే రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ షో కు రావడం మానేశారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం ఆ షో నుంచి తప్పుకున్నారు. అయితే మంత్రి పదవిపోయి.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజా తిరిగి జబర్దస్త్ లోకి రావాలి అనుకుంటే అనుమతి లభించలేదన్న టాక్ ఉంది. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఉంటూ.. బుల్లితెర షోల్లో పాల్గొంటున్నారు. దానినే తప్పు పడుతున్నారు మాజీ మంత్రి రోజా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో విమర్శలు..
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోజా జబర్దస్త్ షో చేశారు. అయితే ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉంటూ.. అటువంటి షోలు చేయడం ఏమిటనేది సోషల్ మీడియా వేదికగా వచ్చిన కామెంట్. అయితే ఆమె షోలు చేయడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న భావన వైసిపి నేతల్లో కూడా ఉండేది. అయితే ఎమ్మెల్యేగా ఉండే వరకు ఓకే కానీ.. తరువాత మంత్రిగా మారిన తర్వాత జబర్దస్త్ షోలకు గుడ్ బై చెప్పారు రోజా. దక్షిణ భారతదేశంలోనే ఈ షో ఎంతో ఆకట్టుకుంది. వివిధ కారణాలతో రోజా కంటే ముందే అశోక్ నుంచి తప్పుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. బుల్లితెర షోలకు హాజరవుతున్నారు.
దక్కని అవకాశాలు..
నగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు రోజా. మళ్లీ బుల్లితెరలో బిజీ కావాలని భావించారు. అనుకున్న మేర అవకాశాలు దక్కలేదు. కానీ అధికార పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. ఆయనకు మాత్రం యధావిధిగా బుల్లితెర షోల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఎంత మాత్రం రోజాకు మింగుడు పడడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అయితే ఎమ్మెల్సీ అయిన వారు సైతం మళ్లీ షో లకు వస్తున్నారని.. తనను మాత్రం తప్పు పట్టారంటూ నాగబాబుపై పరోక్ష విమర్శలు చేశారు రోజా. అయితే తనకు దక్కనిది నాగబాబుకు దక్కిందన్న ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రోజాపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.