Uttar Pradesh Wedding Incident: అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. బలియా జిల్లా రేవతి పోలీస్ స్టేషన్.. అక్కడికి చాలామంది వచ్చారు. కొందరికి గాయాలయ్యాయి. వారంతా రక్తపు మరకలతో కనిపించారు. అంతమంది రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. జరిగిన విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు . అయితే వారు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇలా కూడా జరుగుతుందా అంటూ ఖిన్నులయిపోయారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో రేవతి పోలీస్ స్టేషన్ పరిధిలో గాయ్ ఘాట్ గ్రామంలోని పంచర్ముఖి ఆలయంలో ఈనెల 11న ఒక పెళ్లి జరగాలి. ఆ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగాయి. మరి కొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనుకుంటుండగా.. ఊహించని గొడవ చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేదిక కాస్త రణరంగంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో వరుడు సోదరుడు, అతడి తల్లి, మరో మహిళా గాయపడ్డారు.
ఇంత గొడవ జరగడానికి ప్రధాన కారణం చీర. వివాహాలు జరుగుతున్నప్పుడు మటన్ ముక్కలు వేయలేదని.. చికెన్ సరిపడా వడ్డించలేదని గొడవలు పడ్డ సందర్భాలు అనేకం చూశాం. కొన్ని సందర్భాలలో వివాహాలు జరిగిపోయిన వ్యవహారాలు కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వరుడి తరఫున వధువుకు తెచ్చిన చీర నచ్చకపోవడంతో గొడవ జరిగింది. దీంతో పెళ్లి చేసుకోవడానికి వధువు ఒప్పుకోలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. రెండు కుటుంబాల వారు కూడా విపరీతంగా దాడులు చేసుకున్నారు. దీంతో వివాహ క్రతువు కాస్త యుద్దభూమిగా మారిపోయింది. పెళ్లి కుమారుడు విశాల్ గోండు తీసుకొచ్చిన చీర తనకు ఏమాత్రం నచ్చలేదని వధువు చెప్పింది. అంతేకాదు అతడిని పెళ్లి చేసుకోలేనని స్పష్టం చేసింది. దీంతో వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత గొడవ జరిగింది.
ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాల వారిని విచారించారు. జరిగిన విషయాన్ని తెలుసుకొని.. కేసులు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చీర కోసం వధువు ఈ స్థాయిలో పట్టుబట్టడం సరికాదని.. వధువు నచ్చే చీర తేకుండా.. వరుడి తరుపువారు ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదని స్థానికులు అంటున్నారు.