TANA Support For Farmers: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్ల పంపిణీ
గుడివాడ రైతులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అండగా నిలిచింది. “రైతు కోసం” కార్యక్రమంలో భాగంగా తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో రైతులకు రూ.25 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.

సోమవారం గుడివాడ మార్కెట్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వం వహించారు.

కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులతో కలిసి స్ప్రేయర్లు, టార్పలిన్లను పరిశీలించి వారికి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, దేశం పట్ల ప్రేమతో ప్రవాసాంధ్రులు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తానా నిదర్శనమని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి వేలాది మంది రైతులకు సహాయం చేస్తున్న కసుకుర్తి రాజా దాతృత్వాన్ని ప్రశంసించారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులతో సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతన్నల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, “రైతు కోసం” కాన్సెప్ట్లో భాగంగా ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో రూ.1.03 కోట్లతో సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రాము కృషితో గుడివాడలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.

ప్రభుత్వం సబ్సిడీపై అందించే టార్పలిన్లు, ఖరీదైన చార్జింగ్ స్ప్రేయర్లను ఉచితంగా అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాము, తానా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, టీడీపీ, జనసేన నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
