IND vs ZIM 4th T20 : నాలుగో టీ20 కూడా యువభారత్ దే ..సీనియర్ ఆటగాళ్లు లేకుండానే సిరీస్

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం భారత్ - జింబాబ్వే జట్లు నాలుగో టీ -20 మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన గిల్ జింబాబ్వే జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు

Written By: Bhaskar, Updated On : July 13, 2024 10:20 pm
Follow us on

IND vs ZIM 4th T20 : జింబాబ్వే అద్భుతం చేయలేదు. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో సంచలనం నమోదు కాలేదు. సికిందర్ రజా సేన అంతకుమించి అనేలా ఆడుతుందనుకుంటే.. అలాంటిదేమీ జరగలేదు. నాలుగో టీ – 20 లోనూ గత మ్యాచ్ ల తాలూకూ ఫలితమే పునరావృతమైంది..3-1 తేడాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ భారత జట్టు వశమైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జింబాబ్వేకు భంగపాటు మిగిలింది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం భారత్ – జింబాబ్వే జట్లు నాలుగో టీ -20 మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన గిల్ జింబాబ్వే జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. జింబాబ్వే జట్టు వెంట వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ రజా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ ఎదుట 153 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. యశస్వి జైస్వాల్ (93*: 53 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు), గిల్(58* 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) జింబాబ్వే బౌలింగ్ ను ఉతికి ఆరేశారు. ఈ విక్టరీతో భారత జట్టు 3-1 తేడాతో ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఇక నామమాత్రమైన ఐదవ టి20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు వెంట వెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టు 100 పరుగులైనా చేయగలుగుతుందా అనే అనుమానం కలిగింది. ఈ దశలో కెప్టెన్ రజా స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లకు 7 వికెట్లు లాస్ అయ్యి 152 రన్స్ చేసింది. జింబాబ్వే ఓపెనర్లు మదెవర్(25), మరుమాని (32) మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రజా(46: 28 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. బెనెట్(9), క్యాంప్ బెల్(3), మేయర్స్ (12), మదాండే(7) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, తుషార్ దేశ్ పాండే, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

వాస్తవానికి తొలి టి20 మ్యాచ్ లో విజయం సాధించిన జింబాబ్వే.. ఆ దూకుడు మరుసటి మ్యాచ్ లలో కొనసాగించలేకపోయింది. సీనియర్ ఆటగాళ్లు సరిగ్గా ఆడక పోవడం ఆ జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. బౌలర్లు స్థిరంగా బౌలింగ్ చేయలేకపోవడం, ఫీల్డింగ్ అత్యంత నాసిరకంగా ఉండడం.. జింబాబ్వే వరుస పరాజయాలను మూట కట్టుకోవాల్సి వచ్చింది.. మొదటి టి20లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత మ్యాచ్లలో దూకుడు కొనసాగించడంతో వరుసగా విజయాలను అందుకుంది.

టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ ఇండియాలో సీనియర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఐపీఎల్ లో సత్తా చాటిన ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇందులో బాగానే గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. దీంతో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో జింబాంబే పై ప్రదర్శన చేసింది.. రెండో టి20 లో గిల్ తేలిపోయినప్పటికీ.. వరుసగా రెండు టీ20 మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్ తృటి లో సెంచరీ మిస్ అయినప్పటికీ.. దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. పైగా జింబాబ్వే బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఫోర్లు, సిక్సర్లు బాది.. తాను ఎంత స్పెషలో మరోసారి నిరూపించాడు.