Joseph Ravan: జోసెఫ్ రావణ్ అరెస్టు ఒక ఎత్తు అయితే.. ఆయనపై నమోదైన కేసులు మరో ఎత్తు. ఏకంగా మరణశిక్షపడేలా సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరుపు వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్ చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 25 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పటివరకు ఆయన సాధారణ సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేసినట్లు అంతా భావించారు. కానీ ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉపా చట్టం కింద కేసు నమోదయింది. ఈ అఫీషియల్ అరెస్ట్ నోటీసు ప్రకారం.. చట్టంలోని సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారం ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చిన కారణంగా ఈ కేసులు పెట్టారు. అత్యంత కఠినమైన దేశద్రోహం ముద్ర కలిగిన సెక్షన్లను చేర్చారు. వీటితోపాటు భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విశేషం.
* బలమైన వాదనలు..
ప్రస్తుతం జోసెఫ్ రావణ్ తరఫున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా 25 మంది న్యాయవాదులు ప్రభుత్వం తరఫున రంగంలోకి దిగడంతో శ్రావణ్ కుమార్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా ఉపా చట్టం కింద కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన 24 గంటల్లోపు తప్పనిసరిగా స్థానిక మేజిస్ట్రేట్ లేదా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ ఈ ఉపా చట్టం కింద నిర్బంధించినప్పుడు పోలీసులకు లీగల్ గా అదనపు సమయం, కొన్ని మినహాయింపులు లభిస్తాయి. నిందితుడిని కోర్టు అనుమతితో గరిష్టంగా 30 రోజుల వరకు పోలీస్ కస్టడీకి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సాధారణ కేసుల్లో 60 నుంచి 90 రోజుల్లోగా చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. ఉపా కేసుల్లో దర్యాప్తు సంస్థలకు కోర్టు అనుమతితో 180 రోజుల వరకు చార్జ్ షీట్ దాఖలు చేసే గడువు ఇస్తుంది.
* బెయిల్ సులభం కాదు..
ఈ చట్టం కింద ఒక్కసారి కేసు నమోదు అయితే నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించదు. ఈ చట్టంలోని సెక్షన్ 43డ్ (5) ప్రకారం నిందితుడిపై మోపిన ఆరోపణలు ప్రాథమికంగా నిజం అని కోర్టు భావిస్తే.. సదరు నిందితుడికి బెయిల్ నిరాకరించే సంపూర్ణ హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. సాధారణ కేసుల్లో బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది ఒక మినహాయింపు. కానీ ఈ చట్టం కింద మాత్రం అది వర్తించదు. ఈ కేసులో నిందితుడు తరుపు వాదించే లాయర్లకు కూడా కోర్టులో తక్షణ ఉపశమనం లేదా బెయిల్ తీసుకురావడం చట్టపరంగా అతిపెద్ద సవాల్. ఇప్పుడు అదే
నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు జోసఫ్ రావణ్ తరఫున వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్. మరణశిక్షతో సమానమైన సెక్షన్లు పెట్టారని.. 25 మంది న్యాయవాదులు వాదిస్తున్నారని.. వందలాదిమంది పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పట్లో రావణ్ బయటకు రావడం అసాధ్యం అని సంకేతాలు ఇస్తున్నారు.

