Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి విరాళాల వెల్లువ.. ఎన్ని కోట్లు వచ్చాయంటే.. వైరల్ వీడియో

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రోజే లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సెక్యూరిటీ సమస్యతో తొలి రోజు ఎవరినీ అనుమతించలేదు. దీంతో మంగళవారం వేకువ జామునుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.

Written By: Raj Shekar, Updated On : January 25, 2024 2:10 pm
Follow us on

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి దర్శనానికి భక్తులు పొటెత్తుతున్నారు. బాలరాముడి కోసం క్యూలైన్లలో కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఆలయం వెలుపల గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సోమవారం(జనవరి 22న) నిర్వహించారు. మొదటి రోజు 7 వేల మంది అతిథులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ సిబ్బందితోపాటు, జర్నలిస్టులకు అవకాశం కల్పించారు. మొత్తంగా తొలి రోజు 15 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. జనవరి 23 నుంచి అందరికీ దర్శనం.

ప్రాణ ప్రతిష్టరోజు లక్షల మంది..
బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రోజే లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. సెక్యూరిటీ సమస్యతో తొలి రోజు ఎవరినీ అనుమతించలేదు. దీంతో మంగళవారం వేకువ జామునుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. మంగళవారం సుమారు 5 లక్షల మంది బాల రాముడిని దర్శించుకున్నారు. విపరీతమైన రద్దీ కారణంగా రామమందిరానికి వెళ్లే ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనాలను దారి మళ్లించారు. అటువైపు నడిచి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. రద్దీ నియంత్రణలో భాగంగా సుల్తాన్‌పూర్‌ నుంచి అయోధ్య మార్గంలో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. రద్ధీని నియంత్రణ ఏర్పాట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లఖన్‌పూర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్యకు అదనపు బస్సులను నిలిపివేశారు.

రెండో రోజు 3 లక్షలు..
ఇక అయోధ్యకు జనవరి 23న 3 లక్షల మంది భక్తులు వచ్చారు. దేశం నలు మూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రామ్‌ పథ్, ధర్మ పథ్, జన్మభూమి పథ్‌లో ఏర్పాటు చేసిన క్యూలైన్ల నుంచి భక్తులను ఆలయంలోకి ప్రవేశించేలా చూస్తున్నారు. ఇక వీఐపీలు, ప్రముఖులు వారం ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

భారీగా విరాళాలు..
ఇదిలా ఉండగా లక్షల సంఖ్యలో అయోధ్యకు భక్తులు వస్తుండడంతో రామయ్యకు విరాళాలు కూడా భారీగా వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రూ.317 కోట్ల ఆదాయం వచ్చింది. స్వామిని దర్శించుకున్న భక్తులు తమకు తోచినంతగా కానుకలు ఇస్తున్నారు. బంగారు ఆభరణాలు హుండీల్లో వేస్తున్నారు. దీంతో భారీగా విరాళాలు వస్తున్నట్లు ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. తొలి రోజు రూ.4 రోట్లకుపైగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

కేంద్ర మంత్రులకు ప్రధాని సూచన..
ఇదిలా ఉండగా అయోధ్యలో భక్తుల రద్ధీ ఉన్నందున కేంద్ర మంత్రులెవరూ ఫబ్రవరి ముగిసే వరకు అయోధ్యకు వెళ్లొద్దని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఈమేరకు సూచన చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ప్రజల స్పందన కూడా తెలుసుకోవాలని సూచించారు.