Honeymoon Trip: గోవాకు వెళ్దామంటే.. అయోధ్యకు తీసుకెళ్లాడు.. విడాకులు కోరిన భార్య

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ రంగంలో పనిచేస్తుంటాడు. వేతనం నెలకు 5 అంకెలకు మించి ఉంటుంది. అయితే ఇటీవల అతడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే తనకు కాబోయే భార్యతో గురించి చర్చించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 25, 2024 2:15 pm
Follow us on

Honeymoon Trip: వాళ్ళిద్దరికీ ఇటీవల పెళ్లయింది. పెళ్లికి ముందే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి పూర్తయిన తర్వాత హనీమూన్ వెళ్దామని అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఈ లోగా భర్త ఆలోచన మారింది. గతంలో వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్దామని భార్యకు చెప్పాడు. అది ఆమెకు నచ్చలేదు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది చినికి చినికి గాలి వాన లాగా మారి చివరికి ఆ భార్య విడాకులు కోరే స్థాయికి చేరింది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చదవండి..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ రంగంలో పనిచేస్తుంటాడు. వేతనం నెలకు 5 అంకెలకు మించి ఉంటుంది. అయితే ఇటీవల అతడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే తనకు కాబోయే భార్యతో గురించి చర్చించాడు. అయితే ఆమె విదేశాలకు వెళ్దామని చెప్పింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. తన తల్లిదండ్రులు వృద్ధులని, వారిని చూసుకునేవారు ఎవరూ లేరని, మనదేశంలోనే ఏదైనా ప్రదేశానికి వెళ్దామని చెప్పాడు. అయితే ఆమె గోవా అని చెప్పింది. దానికి అతడు కూడా ఒప్పుకున్నాడు. ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూమ్ టికెట్లు బుక్ చేశాడు. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లడమే మిగిలింది. కానీ ఈలోగా ఆ వ్యక్తి తన ప్రణాళిక మార్చాడు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి వెళ్దామని ఆ వ్యక్తి తల్లి కోరింది. తల్లి కోరికను కాదనలేక.. పైగా ఆమె వృద్ధురాలు కావడంతో.. ఆ వ్యక్తి అయోధ్యకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాడు.. భర్త మాట కాదనలేక ఆ భార్య అతనితోపాటు వెళ్ళింది. అయోధ్య, వారణాసి ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి ఆధ్యాత్మిక ప్రాంతాలను చూసి వచ్చారు. ఆ ప్రయాణం ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరగడం మొదలైంది.

హనీమూన్ ట్రిప్ గోవాకు తన భర్తతో కలిసి వెళ్లాలి అనుకుంటే అనూహ్యంగా అయోధ్య, వారణాసికి మార్చడంతో ఆ భార్య తీవ్ర అసహనానికి గురి అయింది. దీని గురించి భర్తతో మాట్లాడితే అతడు సరిగ్గా పట్టించుకోలేదు. ఇది ఆమెలో మరింత మనస్థాపానికి కారణమైంది.. అంతేకాదు భార్యాభర్తలిద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఇక సహించేది లేక భార్య తన భర్త నుంచి విడాకులు కావాలని కోరింది. భోపాల్ ఫ్యామిలీ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు తనకంటే ఆయన కుటుంబ సభ్యులకే తన భర్త అధిక ప్రాధాన్యమిస్తాడని.. అలాంటప్పుడు ఆయన భార్యగా కొనసాగడం తనకు ఇష్టం లేదని.. అందులో అర్థం కూడా లేదని ఆమె పేర్కొంది. దీనిపై ఇంతవరకు ఆ భర్త నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆమె కోరినట్టుగా విడాకులు ఇస్తాడా? లేకుంటే భార్య మనసు తెలుసుకొని నడుచుకుంటాడా? అనేది తర్వాత తేలుతుందని కోర్టు వర్గాలు అంటున్నాయి.