Hyderabad: తన భార్య కొడుతుందని, తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఓ బాధిత భర్త పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లయిననాటి నుంచి మానసికంగా, శారీరకంగా హింసిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రెస్మీట్లో తన భార్య చేసిన గాయాలను ప్రదర్శించాడు. మీడియతో గోడు వెల్లబోసుకున్నాడు.
ప్రముఖ కాలేజీలో ప్రొఫెసర్..
ఆంధ్రప్రదేశ్లోని రాజోలు ప్రాంతానికి చెందిన టెమూనియన్కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. టెమూనియన్ హైదరాబాద్లోని మల్లారెడ్డి కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. భార్యతో కలిసి అల్వాల్లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు.
పెళ్లయిన నాటి నుంచే టార్చర్..
ఇక టెమూనియన్ను లక్ష్మీగౌతమి పెళ్లయిన నాటి నుంచే టార్చర్ పెడుతోంది. మానసికంగా, శారీరకంగా హింసిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసిలా ప్రవర్తిస్తోంది. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా.. ఆమె తీరులో మార్పు రాలేదు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడిచేసిందని టెమూనియన్ కన్నీరు పెట్టుకున్నాడు.
ఫిర్యాదు చేస్తే సెక్షన్లు లేవని..
ఈ విషయంపై టెమూనియన్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించాడు. భర్తలను భార్యలు హింసిస్తే ఎలాంటి కేసు పెట్టాలో సెక్షన్లు లేవని పోలీసులు చెప్పారన్నారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించాడు. తాను రెండు రోజులుగా ఇంటికి కూడా వెళ్లడం లేదని పేర్కొన్నాడు. ఇంటికి వెళ్తే భార్య తనపై దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులే తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.
ఇద్దరిపై కేసు…
టెమూనియన్ ప్రెస్మీట్ అన్ని టీవీ చానెళ్లు, పత్రికల్లో రావడంతో అల్వాల్ పోలీసులు స్పందించారు. టెమూనియన్ ఫిర్యాదు మేరకు లక్ష్మీగౌతమిపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో లక్ష్మీగౌతమి కూడా టెమూనియన్పై ఫిర్యాదు చేయడంతో అతనిపై కూడా కేసు పెట్టారు.