HomeNewsAP Politics : ఉన్న మంత్రి పదవి ఒక్కటి.. ఆశావహులు 50 మంది

ఉన్న మంత్రి పదవి ఒక్కటి.. ఆశావహులు 50 మంది

AP Politics :  ఏపీలో కూటమి ప్రభుత్వం నెలరోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టు సాధించని మంత్రులను మార్చుతానని ఇప్పటికే చంద్రబాబు హెచ్చరించారు. దీంతో మంత్రులు సైతం తమ శాఖల్లో సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్య సమీక్షలు చేస్తున్నారు.

ఈసారి మంత్రివర్గంలో చంద్రబాబు జూనియర్లకు పెద్దపీట వేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. పదిమంది మంత్రులు కొత్తగా ఎన్నికైన వారే. కాకలు తీరిన యోధులు, హేమహేమీలు ఉన్నా జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే వ్యూహాత్మకంగా ఒక మంత్రి పదవిని విడిచిపెట్టారు. 25 మంది మంత్రులు ఉండగా.. 24 మందిని మాత్రమే భర్తీ చేశారు. ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికి కేటాయిస్తారు? లేకుంటే వ్యూహాత్మకంగానే ఖాళీగా పెట్టారా? అన్నది చర్చకు దారితీస్తోంది. అయితే ఆ ఒక్క మంత్రి పదవిపై దాదాపు 50 మంది వరకు ఆశలు పెట్టుకున్నారు. తమకే చాన్స్ వస్తుందని ఆశతో ఉన్నారు. చంద్రబాబు మైండ్ లో ఏమున్నది అన్నది తెలియడం లేదు. ఆశావహుల సంఖ్య మాత్రం పెద్దదిగా ఉంది.

తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, మాజీ మంత్రులైన పరిటాల సునీత, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ, కూన రవికుమార్, చింతమనేని ప్రభాకర్, రఘురామకృష్ణం రాజు, ఆలపాటి రాజా, ధూళిపాల నరేంద్ర, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి.. ఇలా జాబితాలో చాలా పేర్లు ఉన్నాయి.

ఈసారి శాసనమండలి సభ్యులకు మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు యనమల రామకృష్ణుడు, నారాయణలతో పాటు నారా లోకేష్ కు మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఈసారి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఛాన్స్ దక్కలేదు. కూటమి తరపున 166 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో.. మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. మూడు పార్టీలు కూటమిగా వెళ్లడంతో ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కరు చొప్పున మంత్రి పదవులు కేటాయించారు. 21 స్థానాలను గెలుచుకున్న జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. 8 స్థానాలను గెలుచుకున్న బిజెపికి ఒక మంత్రి పదవితో సరిపెట్టారు. మిగిలిన మంత్రి పదవులను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కానీ ఒక మంత్రి పదవిని మాత్రం చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. అయితే దానిని ఎందుకు పెండింగ్లో పెట్టారు? ప్రత్యేకమైన వ్యక్తికి ఇవ్వనున్నారా? ఎప్పుడు ఆ మంత్రి పదవి భర్తీ చేస్తారు? అన్న ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈసారి పొత్తుల్లో భాగంగా చాలా చోట్ల సీనియర్లు త్యాగాలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం టికెట్ ను వదులుకున్నారు. అప్పటివరకు ఇన్చార్జిగా ఉన్నా.. వైసిపి నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో ఆయన కోసం త్యాగం చేశారు. పిఠాపురం సీటును త్యాగం చేశారు వర్మ. అది గెలిచే స్థానమైన పవన్ కళ్యాణ్ కోసం వదులుకున్నారు. గత రెండు ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ. ఆయనకు సైతంసర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గుర్నీ ఎమ్మెల్సీలుగా తీసుకొని.. ఒకరికి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular