అఫ్గనిస్తాన్ లో అరాచక పాలన సాగుతోంది. తాలిబన్ల చెరలో ప్రజలు అల్లాడిపోతున్నారు. అడుగు తీసి బయట వేయాలంటే నరకమే. అడుగడుగునా నిఘా పెట్టి మరీ చిత్రహింసలు పెడుతున్నారు. దేశంలో ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సమయానికి డబ్బు దొరకదు. రోజురోజుకు బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. ఇటీవల కాబుల్ విమానాశ్రయం వద్ద రెండు పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు నిత్యం భయాందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ప్రస్తుతం కూడా ఉగ్రదాడులు జరిగే సూచనలున్నాయని నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రజలు భయపడుతున్నారు. ఇన్నాళ్లు బతికిన గడ్డను విడిచి వెళ్లడానికి ఇష్టం లేకున్నా వెళ్లక తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకుని మరీ వెళుతున్నారు.
కాబుల్ అంతర్జాతీయ విమాశ్రయం వద్ద ప్రజలు పడిగాపులు పడుతున్నారు. దేశం విడిచి వెళ్లేందుకు వివిధ దేశాల ప్రజలు గుమిగూడి ఉండడంతో తొక్కిసలాట చోటుచేసుకుంటోంది. వేలాది మంది ప్రజలు విమానాశ్రయం వద్ద తమ వంతు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. దేశం దాటి పోయేందుకు ఆరాట పడుతున్నారు. తాలిబన్ల బారి నుంచి రక్షించుకునే క్రమంలో వారి బాధలు వర్ణనాతీతం.
ఇక ఆర్థిక వ్యవస్థ కూడా అగాధంలో పడిపోతోంది. వేతనాల కోసం ఉద్యోగులు బ్యాంకుల ముందు ఆందోళనకు దిగుతున్నారు. సామాన్యులు సైతం ఏటీఎం యంత్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అక్కడి పరిస్థితులతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు. గత ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతోనే తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ఇక ఏటీఎంల్లో కూడా డబ్బు పెట్టే విషయంలో ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రజలకు డబ్బులు అందడం లేదు. ఏటీఎం కేంద్రాల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడి ఎదురు చూడక తప్పడం లేదు. అఫ్గాన్ లో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ గందరగోళం నెలకొందని తెలుస్తోంది. వీధుల్లో హృదయావిదారకర దృశ్యాలు కలవరపెడుతున్నాయి.