World Tallest Lord Shiva Statue: కర్ణాటకలోని మరుడేశ్వర్, తమిళనాడులోని ఆది యోగి.. ఇప్పటిదాకా శివుడికి సంబంధించి ఇవే ఎత్తైన విగ్రహాలు. ఇక వాటి రికార్డును రాజస్థాన్లోని కైలాసనాధుడి విగ్రహం బ్రేక్ చేసింది.. 369 అడుగులు ఉన్న కైలాసనాధుడి విగ్రహాన్ని “విశ్వాస్ స్వరూపంగా” పేర్కొంటున్నారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాపు, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ శనివారం ప్రారంభించారు

విశేషాలు ఏమిటంటే
రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో 369 అడుగుల కైలాస నాథుడి విగ్రహాన్ని నిర్మించారు. విశ్వాస్ స్వరూపంగా ఈ విగ్రహాన్ని పేర్కొంటున్నారు. విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా తొమ్మిది రోజులపాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహంగా దీనిని పేర్కొంటున్నారు.. ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్ పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది.. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది.. శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు 3 వేల టన్నుల స్టీల్ వినియోగించారు. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను వాడారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.. అప్పట్లోనూ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్ ఉన్నారు. మొరారి బాపుతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శివుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాల్ నిర్మించారు.. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు రకాల మెట్ల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రిపూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుంది.. 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలినయినా తట్టుకునే సామర్థ్యంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

ఆహ్లాదకరంగా ఉండేందుకు
ఈ పర్యాటక ప్రాంతానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంప్, జిప్ లైన్, గో కార్డ్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్ వంటివి ఇక్కడ ఉన్నాయి. శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం తొమ్మిది రోజులపాటు అంటే నవంబర్ 6 వరకు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన శివుడి విగ్రహం ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త శోభనం తీసుకొస్తుంది. ఇక తొమ్మిది రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాపు రామ్ కథను చదివి వినిపించనున్నారు..