Karpoori Thakur: సరిగ్గా గణతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందుగానే రాష్ట్రపతి భవన్ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రీ కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారం అందిస్తున్నట్టు వివరించింది. ఇంతకీ ఎవరు ఈ కర్పూరీ ఠాకూర్? రాష్ట్రపతి భవన్ ఆయనకు ఎందుకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ను ప్రకటించింది? బీహార్లో కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా అయినటువంటి కర్పూరీ ఠాకూర్ కార్యక్రమాలు చేపట్టారు? అక్కడి ప్రజల్లో ఎటువంటి ముద్ర వేయగలిగారు? అకస్మాత్తుగా ఆయనపై రాష్ట్రపతి భవన్ కు ఎందుకు ప్రేమ కలిగింది? భారతరత్న పురస్కారం అందించే వైపు ఎందుకు అడుగులు వేయించింది? ఈ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఓ గ్రామానికి సర్పంచ్ అయితేనే ఒక లెవెల్ మైంటైన్ చేస్తున్న రోజులు ఇవి. ఓ వార్డుకు కౌన్సిలరే ఎమ్మెల్యే లాగా బాబు ధర్మం ప్రదర్శిస్తున్న రోజులు ఇవి. ఆస్తులు కూడపెట్టడం.. అవినీతికి పాల్పడటం.. అధికారుల మీద పెత్తనం చెలాయించడం.. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవ లక్షణాలు నేటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ కర్పూరీ ఠాకూర్ కు సొంత కారు లేదు. వేల కోట్ల వ్యవహారాలు తన ఆధ్వర్యంలో జరిగినప్పటికీ సొంత ఇల్లు లేదు. పైగా ప్రజలను తాగుబోతులను చేయడంలో పోటీపడుతున్న పాలకులు ఉన్న నేటి రోజుల్లో ఆయన అప్పట్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేశారు. అడుగులు వేయడం కాదు దానిని చేతుల్లో చేసి చూపించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. విద్య, సాగునీటి రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ వంటి రాజకీయ దురంధురులకు గురువుగా కర్పూరీ ఠాకూర్ పేరు గడించారు.
ఇది కర్పూరీ ఠాకూర్ జయంతి సంవత్సరం. 19 24 లో బీహార్ లో జన్మించారు. 1988లో కన్నుమూశారు. తాను జన్మించిన బీహార్ లోనే కాదు మొత్తం ఉత్తరాది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించారు. అందుకే అక్కడి ప్రజలు ఆయనను జన్ నాయక్ అని పిలుస్తారు.. 1924 జనవరి 24న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలోని పితోంజియా గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరీ ఠాకూర్ జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరారు. 1942 నుంచి 1945 మధ్యలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో వేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో పనిచేశారు. 1952లో సోషలిస్ట్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆస్ట్రియాకు బీహార్ నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్లగా.. ఇందులో కర్పూరీ ఠాకూర్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఎందుకు కోటు కావలసి ఉండటం.. అది ఆయన దగ్గర లేకపోవడంతో స్నేహితుడి వద్ద అడిగి తీసుకెళ్లారు. అయితే ఆ కోటు చినిగి ఉన్నప్పటికీ.. అలాగే తీసుకెళ్లారు. ఆ కోటు చూసిన యుగోస్లోవియా అధినేత మార్షల్ టిటో ఆయనకు కొత్త కోటు అందించారు..
కర్పూరీ ఠాకూర్ తరలించి అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. చివరికి ఆయనకు సొంత కారు, ఇంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదు. చివరికి సరైన దుస్తులు కూడా ఆయనకు ఉండేవి కావు. రాజకీయంగా కర్పూరీ ఠాకూర్ అంచలంచెలుగా ఎదిగారు. బీహార్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970 డిసెంబర్లో కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏడు నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. 1977లో మరొకసారి ఆ పదవిని అధిష్టించారు. రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి పదవిని చేపట్టినప్పుడే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ముంగేరి లాల్ కమిషన్ ఏర్పాటు చేసి.. అని సిఫారసులు అమలు చేశారు. అయితే ఈ కమిషన్ మండల్ కమిషన్ కన్నా ముందే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో వాటాను సిఫారసు చేసింది. బీహార్ రాష్ట్రంలో బలంగా ఉండే కుల వివక్షకు వ్యతిరేకంగా కర్పూరీ ఠాకూర్ పోరాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన కృషి వల్ల బీహార్ రాష్ట్రంలోని లక్షలాదిమంది బాగుపడ్డారు. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ వంటి వారి ప్రభావం కర్పూరీ ఠాకూర్ పై అధికంగా ఉంది. వారితో కర్పూరీ ఠాకూర్ అత్యంత సాహిత్యం ఉండేది. 1988 ఫిబ్రవరి 17న కర్పూరీ ఠాకూర్ కన్నుమూశారు. ఆయన కన్ను మూసేంతవరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన స్వగ్రామాన్ని ప్రస్తుతం కర్పూరీ గ్రామ్ గా పిలుస్తున్నారు. కాగా ఆయనకు రాష్ట్రపతి భవన్ భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అల్ప సంఖ్యాక వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తి బీహార్ రూపు రేఖలు మార్చివేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు భారతరత్న పురస్కారం అందించడం గొప్ప విషయం అన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.