కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఉపాధిని, ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో లోన్లు తీసుకున్న వినియోగదారులు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందులను గమనించిన కేంద్ర ప్రభుత్వం ముందుగా మూడు నెలలు మారిటోరియం ప్రకటించింది. మూడు నెలల వరకు ఈఎంఐలు కట్టకున్నా బ్యాంకులు ఒత్తిడి చేయవద్దని తెలిపింది. అయితే ఆ తరువాత వాయిదాల పద్దతిలో చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. మార్చి 1 నుంచి మే వరకు గడువు ప్రకటించి ఆ తరువాత మరో మూడు నెలలు ఆగస్టు 31 వరకు పెంచింది.
Also Read: గూగుల్ పే యూజర్స్.. బీ అలర్ట్
మారిటోరియంను వినియోగించుకున్న వినియోగదారులపై బ్యాంకులు మాత్రం వడ్డీలు, చక్రవడ్డీలు విధించాయి. దీంతో వినియోగదారులు వడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. మారిటోరియం వినియోగించుకున్న వారికి వడ్డీ చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.5000 నుంచి రూ.7000 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. కేసు వినియోగదారులకు అనుకూలంగా వస్తే ఎవరెవరు ఎన్ని నెలలు మారిటోరియం వినియోగించుకున్నారో వారికి లబ్ధి చేకూరనుంది.
తాజాగా మారిటోరియం వినియోగించుకున్న వారికి ప్రభుత్వం వడ్డీ చెల్లించడంతో నెలనెలా సక్రమంగా ఈఎంఐలు చెల్లించినవారు మాకేమీ లేదా అన్నట్లు నిట్టూర్చారు.. అయితే మారిటోరియం వినియోగించుకోకుండా సక్రమంగా ఈఎంఐలు చెల్లించిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం రివార్డు ప్రకటించే అవకాశం ఉంది. మారిటోరియం వినియోగించుకున్నవారికి వడ్డీ చెల్లించనుండగా ఈఎంఐలు చెల్లించిన వారికి ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వాలని సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రచురించింది.
Also Read: లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్
రూ. 2 కోట్ల లోపు రుణం తీసుకున్న వ్యక్తులు, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు క్యాష్బ్యాక్ ఇచ్చే యోచనలో ఉందట. కరోనా కష్ట సమయంలో లోన్ చెల్లించినవారికి ఈమాత్రం రివార్డు ప్రకటించకపోతే ఎలా..? అందుకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆర్థిక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. మారిటోరియంపై వడ్డీ మాఫీ చేసే విషయం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇది పూర్తయిన తరువాత ఈఎంఐలు చెల్లించిన వారికి రివార్డులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో వారిలో కొంత ఉత్సాహం నెలకొన్నట్లయింది.