Budget 2024: నిర్మల బడ్జెట్ చదువుతుండగానే.. కేంద్రం కీలక నిర్ణయం..ఆ ధరలు తగ్గే అవకాశం

Budget 2024 తాజా బడ్జెట్లో వాటిపై సుంకాన్ని 15 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల తయారీకి సంబంధించి వాడే పరికరాలను వాటి తయారీ సంస్థలు ఇతర దేశాల నుంచి దిగిన చేసుకుంటున్నాయి. వాటిపై మన దేశం ఎప్పటినుంచో సుంకం విధిస్తూ వస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 1, 2024 12:13 pm

Budget 2024

Follow us on

Budget 2024: ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్లో మాట్లాడుతుండగానే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. దేశ వృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తికి సంబంధించి వాటి తయారీదారులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మన దేశంలో తయారయ్యే మొబైల్ ఫోన్లకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అయితే వాటిపై దిగుమతి సుంకాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం విధిస్తూ వస్తోంది. తాజా బడ్జెట్లో వాటిపై సుంకాన్ని 15 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ల తయారీకి సంబంధించి వాడే పరికరాలను వాటి తయారీ సంస్థలు ఇతర దేశాల నుంచి దిగిన చేసుకుంటున్నాయి. వాటిపై మన దేశం ఎప్పటినుంచో సుంకం విధిస్తూ వస్తోంది.

తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సిమ్ సాకెట్లు, మెటల్ భాగాలు, సెల్యులర్ మాడ్యూల్స్, మెకానికల్ వస్తువులపై దిగుమతి సుంకం ఐదు శాతానికి తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ తయారీలో ఉపయోగించే మిడిల్ కవర్, మెయిన్ లెన్స్, బ్యాక్ కవర్, జీఎస్ఎం యాంటెన్నా, పీయూ కేస్, సీలింగ్ గాస్కెట్, సిమ్ సాకెట్, స్క్రూ లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు, మెటల్ సామగ్రిపై కూడా కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించింది.. దీనివల్ల దేశీయంగా ఫోన్ల పరిశ్రమ వృద్ధి బాట పడుతుందని.. ఆర్థిక మందగమనం వేళ కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఈ రంగంలో లక్షలాదిమంది ప్రత్యక్షంగా.. అదే స్థాయిలో పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని కేంద్రం ప్రకటించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఫోన్ల పరిశ్రమకు జవసత్వాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఫోన్ల ఉత్పత్తి పెరుగుతుందని.. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం కూడా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు ఫోన్ల ధరలు కూడా తగ్గుతాయని ఆయన వివరించారు. ఇక గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలో స్మార్ట్ ఫోన్ ల తయారీకి ఉపయోగించే వస్తువులపై కేంద్రం సుంకం తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చదువుతుండగానే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తుందని గ్లోబల్ రీసెర్చ్ ఇన్సియేటివ్ సంస్థ పేర్కొంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల దేశీయంగా ప్లాంట్లో ఏర్పాటుచేసి స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్న సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.