Student Success Story: పరీక్ష మందు చిన్నపాటి జ్వరం వస్తేనే చాలామంది ఇబ్బంది పడతారు. ఆ ప్రభావం పరీక్ష మీద ఖచ్చితంగా ఉంటుంది. మార్కులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి. చిన్నపాటి జ్వరం వస్తేనే పరీక్ష మీద ఈ స్థాయిలో ప్రభావం ఉంటే.. ఈమె ఏకంగా 82 కీమో థెరపీలు చేసుకుంది. క్యాన్సర్ వ్యాధిని జయించింది. భరించలేని బాధ ఉన్నప్పటికీ.. చదువుల తల్లి సరస్వతి మాదిరిగా తన ప్రతిభను నిరూపించుకుంది. ఏకంగా ఇంటర్లో 97% మార్కులు సాధించింది.
పశ్చిమ బెంగాల్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో అద్రిజా గాన్ అనే యువతి ఏకంగా 97% మార్కులు సాధించింది. తద్వారా రాష్ట్రస్థాయి ర్యాంకు అందుకుంది. అయితే ఈ స్థాయిలో మార్కులు సాధించడం వెనక కన్నీటి గాధ ఉంది. అద్రిజా మూడు సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నివారణ కోసం ఆమె ఏకంగా 82 సార్లు కీమో థెరపీ చేయించుకుంది. ఆస్పత్రిలో నరకం చూస్తుంది. అయినప్పటికీ ఆమె చదువుకు కీమో థెరపీలు ఆటంకం కలిగించలేదు. ఒకవైపు తీవ్రమైన అనారోగ్య సమస్య.. మరోవైపు ఇబ్బంది పెడుతున్న శస్త్ర చికిత్స.. అయినప్పటికీ ఆమె చదువుకొని కొనసాగించింది. ఒక దశలో తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ ఆమె ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
అద్రిజా పదవ తరగతిలో కూడా 94% మార్కులు సాధించింది. అద్రిజా బిగ్ బజార్ ప్రాంతంలోని రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత బాలికల పాఠశాలలో చదువుతోంది. ఈమె 2018లో అత్యంత అరుదైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. ఆరవ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నప్పుడు ఆమెకు అనారోగ్యం సోకింది. తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు అరుదైన టి సెల్ లింఫోమా సోకినట్టు తేలింది. 2021 వరకు ఆమె చికిత్స తీసుకుంటూనే ఉంది. ఆ సమయంలో ఆమెకు ఏకంగా 82 సార్లు కీమో థెరపీలు చేశారు. వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పటికీ .. మందులు వేసుకుంటే శరీరం సహకరించకపోయినప్పటికీ .. అద్రిజా కష్టపడి చదివింది. అత్యంత ఉత్తమమైన మార్కులు సాధించింది. తద్వారా చదువుకు అనారోగ్యం ఆటంకం కాదని నిరూపించింది. అద్రిజా సాధించిన మార్కుల పట్ల ఆమె తండ్రి మంగల్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన కుమార్తె గొప్ప ప్రయత్నం చేసిందని కొనియాడుతున్నాడు.
