మమత కోటను బీజేపీ బద్దలుకొట్టేనా..?

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోసారి అధికారం కోసం మమత కొత్త పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మరో కొత్త పథకానికి శ్రీకారం చూట్టారు. * 1952లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా వీధిపోరాటాలు సహా దేనినీ వదలకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈనేపథ్యంలో బెంగాల్ రాజకీయాల గత చరిత్ర, వాస్తవ పరిస్థితిని […]

Written By: NARESH, Updated On : March 7, 2021 9:10 am
Follow us on

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరోసారి అధికారం కోసం మమత కొత్త పథకాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా మరో కొత్త పథకానికి శ్రీకారం చూట్టారు.

* 1952లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు
బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా వీధిపోరాటాలు సహా దేనినీ వదలకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈనేపథ్యంలో బెంగాల్ రాజకీయాల గత చరిత్ర, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. 1952 మార్చి 31వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. మొత్తం 238 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, యునైటెడ్ సోషలిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (సీపీఐ, సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్ మార్క్సిస్ట్ గ్రూప్) కూటమి, పీపుల్స్ యునైటెడ్ సోషలిస్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్-రుయ్ కర్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) ప్రధానంగా పోటీ పడ్డాయి. 150 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత బిదన్ చంద్రరాయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

* 1957లో రెండో సారి ఎన్నికలు..
ఆ తర్వాత 1957 మే 8వ తేదీన రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరిగాయి. యునైటెడ్ లెఫ్ట్ ఎలక్షన్ కమిటీ (సీపీఐ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమి, యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లికన్ పార్టీ, డెమెక్రటిక్ వాన్ గార్డ్స్), యునైటెడ్ డెమోక్రాటిక్ పీపుల్స్ ఫ్రంట్ (భారతీయ జనసంఘ్, హిందూ మహాసభ, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) కూటమి, కాంగ్రెస్ (సొంతంగా) ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే.. సింగిల్‌గా 152 స్థానాలు గెలిచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా బిదన్ చంద్రరాయ్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

* 60వ దశకంలో రాజకీయంగా పెను మార్పులు
1962, మే 8వ తేదీన బెంగాల్ అసెంబ్లీలోని 252 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటమితో కాంగ్రెస్ పార్టీ సింగిల్‌ పోటీ పడింది. కాంగ్రెస్ పార్టీ విజయపరంపర మూడోసారి కొనసాగింది. 157 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రఫుల్ల చంద్రసేన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి దాకా ఉమ్మడిగా వున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)లో చీలిక వచ్చింది. 1964 అక్టోబర్ 31- నవంబర్ 7 మధ్య సీపీఐలో చీలిక రాగా మార్క్సిస్టులు వేరు కుంపటి పెట్టుకున్నారు. సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – మార్క్సిస్టు) పార్టీ ఏర్పాటైంది.

* రాష్ట్రపతి పాలనకు బీజం
ఆ తర్వాత 1967 ఫిబ్రవరి 25న బెంగాల్ అసెంబ్లీలో పెరిగిన సీట్లతో కలుపుకుని మొత్తం 280 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బంగ్లా కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ ముఖర్జీ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమిలో పీపుల్స్ యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఐ, బంగ్లా కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా), యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్(సీపీఎం, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) కూటములు భాగస్వామ్యమయ్యాయి. 1967 ఎన్నికల ద్వారా బెంగాల్‌లో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1967 మార్చి 1న యునైటెడ్ ఫ్రంట్‌లో భాగమైన బంగ్లా కాంగ్రెస్‌కు చెందిన అజోయ్ కుమార్ ముఖర్జీ సీఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ.. ఆయన ఐదేళ్ల పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత 1967 నవంబర్ 21న ప్రఫుల్ల చంద్ర ఘోష్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 1968 ఫిబ్రవరి 19 వరకు కొనసాగారు. రాష్ట్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు. దాంతో 1968 ఫిబ్రవరి 20 నుంచి 1969 ఫిబ్రవరి 25 వరకు బెంగాల్‌లో రాష్టపతి పాలన విధించారు.

* 1969లో మధ్యంతర ఎన్నికలు
1969లో బెంగాల్ రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 280 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. యునైటెడ్ ఫ్రంట్ 214 స్థానాలు సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1969 ఫిబ్రవరి 25న యునైటెడ్ ఫ్రంట్ కూటమి పార్టీ తరపున బంగ్లా కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ ముఖర్జీ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బెంగాల్ రాష్ట్రాన్ని భూ సంస్కరణలు, నక్సలైట్ ఉద్యమం కుదిపేశాయి. 1969 ఏప్రిల్ 22న కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-–లెనినిస్ట్) పేర నక్సలైట్లు సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. 1969 జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలోని సీపీఐ, సీపీఎంల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ విభేదాలు అలాగే కొనసాగగా.. 1970 మార్చి 16న అజోయ్ కుమార్ ముఖర్జీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

* 1970లో ప్రభుత్వం రద్దు
1970 మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం రద్దైంది. 1970 జులై 30 నుంచి 1971 ఏప్రిల్ 2 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది. 1971 మార్చిలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగగా.. ముగ్గురు అభ్యర్థులు హత్య గావించబడ్డారు. సీపీఎం, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సుదీంద్రనాత్ కుమార్ గ్రూప్), బిప్లోబి బంగ్లా కాంగ్రెస్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా (నేపాల్ బట్టాచార్య), వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలతో కూడిన యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ ఒకవైపు.. సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా గూర్ఖా లీగ్, బోల్షివిక్ పార్టీ ఆఫ్ ఇండియా (బరాడా ముకుత్ మోని గ్రూప్), ఆర్ సీపీఐ(ఆనంది దాస్ గ్రూప్), సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ(రెబల్) వంటి ఎనిమిది పార్టీలతో కూడిన యునైటెడ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుఎల్డీఎఫ్) బరిలో ప్రధాన అలయెన్సులుగా నిలిచాయి. సీపీఐ నేతృత్వంలోని యుఎల్డీఎఫ్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమిగా ఆవిర్భావించగా.. ఎన్నికల అనంతరం బంగ్లా కాంగ్రెస్ కూడా వారితో జతకట్టింది. దాంతో మాజీ ముఖ్యమంత్రి అజోయ్ కుమార్ ముఖర్జీ మరోసారి 1971 ఏప్రిల్ రెండో తేదీన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండు నెలల్లోనే అంటే 1971 జూన్ 28న అజోయ్ కుమార్ ముఖర్జీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో మరోసారి బెంగాల్ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది. 1971 జూన్ 29 నుంచి 1972 మార్చి 20 వరకు రాష్ట్రంలో రాష్టపతి పాలన కొనసాగింది.

* 1972లో అసెంబ్లీకి ఎన్నికలు
1972 మార్చి 11న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్(ఆర్), సీపీఐ నేతృత్వంలో కూటమి ఏర్పాటైంది. ఈ కూటమికి ప్రొగ్రెస్సివ్ డెమోక్రటిక్ అలయన్స్(పీడీఏ) అని పేరు పెట్టుకున్నారు. మరోపక్క సీపీఎం నేతృత్వంలోని (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సోషలిస్ట్ యూనిటి సెంటర్, రివల్యూషనరి కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లొబి బంగ్లా కాంగ్రెస్, కొంత మంది స్వతంత్రులు) కూటమిగా పోటీ చేశారు. పోలింగ్‌కు ముందు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌తో సీట్లను పంచుకుంది సీపీఎం పార్టీ. మూడో ఫ్రంట్ గా వెస్ట్ బెంగాల్ డెమోక్రటిక్ కూటమి (కాంగ్రెస్, బంగ్లా కాంగ్రెస్-సుశీల్ కుమార్ దారా గ్రూప్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ఇండియన్ అవామీ లీగ్) పోటీకి దిగింది. కాంగ్రెస్(ఆర్)-సీపీఐ కూటమి ఎన్నికల్లో విజయం సాధించగా.. 1972 మార్చి 20న కాంగ్రెస్ నేత సిద్ధార్ధశంకర్ రే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అతర్వాత అయిదేళ్ళ సుస్థిర పాలన కొనసాగగా.. 1977 ఏప్రిల్ 30 నుంచి 1977 జూన్ 20 వరకు రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన విధించారు.

* జ్యోతిబసు శకం ఆరంభం
1977 జూన్ 14న బెంగాల్ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరిగాయి. పెరిగిన సీట్లతో కలిపి మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ (ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బిప్లియో బంగ్లా కాంగ్రెస్)తో కాంగ్రెస్-ఆర్, జనతా పార్టీలు తలపడ్డాయి. లెఫ్ట్ ఫ్రంట్ 231 స్థానాల్లో బంపర్ విజయం సాధించింది. సీపీఎం దిగ్గజ నేత జ్యోతి బసు తొలిసారి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 1977 జూన్ 21న సీపీఎం నేత జ్యోతి బసు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల తర్వాత సీపీఎం పార్టీ బెంగాల్‌ను ఏకచత్రాదిపత్యంగా పాలించింది. ఆ తర్వాత 34 ఏళ్ల పాటు జ్యోతిబసు పరిపాలన అప్రతిహతంగా కొనసాగింది. 1982 ఏప్రిల్- మే నెలల్లో 294 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. సీపీఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్‌లో సీపీఐ కూడా వచ్చి చేరింది. వెస్ట్ బెంగాల్ సోషలిస్ట్ పార్టీ, డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీలు, కాంగ్రెస్(ఐ), కాంగ్రెస్(ఎస్) కూటమిగా పోటీ చేశాయి. 1982 అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్(ఎస్), కాంగ్రెస్(ఐ)లో విలీనమైంది.

* 1982లో బీజేపీ బరిలోకి..
1982లో ఎన్నికల్లో బెంగాల్లో తొలిసారిగా బీజేపీ కూడా పోటీ చేసింది. 1980లో డార్జిలింగ్ హిల్స్‌లో గూర్ఖాలాండ్ ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రంగా డార్జీలింగ్‌ను ప్రకటించాలన్న డిమాండ్ బలపడింది. గూర్ఖా నేషనల్ ఫ్రంట్(సుభాష్ ఘీషింగ్) సారథ్యంలో ‘‘నో స్టేట్ నో వోట్’’ నినాదం గట్టిగా వినిపించింది. అయితే ఈ నినాదం ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో లెఫ్ట్ ఫ్రంట్ 238 స్థానాల్లో గెలుపొందగా జ్యోతి బసు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1987 ఏప్రిల్ 10న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోను జ్యోతిబసు సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. లెఫ్ట్ ఫ్రంట్‌తో కాంగ్రెస్ పార్టీ నేరుగా ఢీకొన్ని ఫలితం లేకపోయింది. రాజీవ్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నాతున్ బంగ్లా (సరి కొత్త బెంగాల్) అన్న నినాదంతో ఎన్నికలను ఎదుర్కొన్నా పెద్దగా సానుకూల ఫలితాలను రాబట్టలేకపోయింది. లెఫ్ట్ ఫ్రంట్ సీట్ల ఏకంగా 251కి పెరిగాయి. తర్వాత ఎన్నికలకు 1992 ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పటికీ జ్యోతిబసు వ్యూహాత్మకంగా 1991లో వచ్చిన పార్లమెంటు ఎన్నికలతో కలిసి ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. 1991 ఏప్రిల్ 24న జరిగిన శాసనసభ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని (జార్ఖండ్ పార్టీ, జీఎన్ ఎల్ ఎఫ్, యూసీపీఐ) కూటమి, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ కూటమి 245 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే.. ఈ ఎన్నికల సందర్భంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. కానీ.. ఆయన మే 21న తమిళనాడులో హత్యకు గురవడానికి ముందే బెంగాల్ అసెంబ్లీ పోలింగ్ ముగిసింది.

* రెబల్ నేతగా మమతా బెనర్జీ
ఆ తర్వాత 1996 మే 13 బెంగాల్ అసెంబ్లీ మరో విడత ఎన్నికలు జరిగాయి. లెఫ్ట్ ఫ్రంట్‌లో భాగమైన ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీలో చీలిక వచ్చింది. ఫార్వార్డ్ బ్లాక్(సోషలిస్ట్) ఆవిర్భావించింది. జనతా దళ్‌కు లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ప్రకటించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. జాతీయ యూత్ కాంగ్రెస్ నేతగా వున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా మారారు. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా మధ్య పొత్తు కుదిరింది. అయితేనేం బెంగాల్ వామపక్ష ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువరించలేకపోయింది. లెఫ్ట్ ఫ్రంట్ 203 స్థానాల్లో విజయం సాధించగా.. జ్యోతిబసు సీఎంగా ఐదో సారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత బెంగాల్ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1996 ఎన్నికల నాటికే కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా మారిన మమతా బెనర్జీ.. 1998 జనవరి 1న ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు మమతా బెనర్జీ. ఆ తర్వాత కమ్యునిస్ట్ వ్యతిరేక నేతగా రాష్ట్రంలో కీలక భూమిక నిర్వహించారు.

* బీజేపీతో మమత పొత్తు
1999 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొన్నారు మమతా బెనర్జీ. 8 లోక్ సభ నియోజకవర్గాల్లో ఏఐటీసీ విజయం సాధించగా.. బీజేపీకి 2 సీట్లు దక్కాయి. లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ) ఖాతాలో 28 సీట్లు వచ్చాయి. 2000 నవంబర్ 5న అనారోగ్య కారణాలతో సీఎం పదవికి జ్యోతిబసు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో 2000 నవంబర్ 6న సీపీఎంకు చెందిన బుద్ధదేబ్ భట్టాచార్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2001 మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. రాజకీయ ఎత్తుగడలు మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. ఈ లెఫ్ట్ ఫ్రంట్-యూపీఏ కూటమి (కాంగ్రెస్, తృణమూల్, జీఎన్ఎల్ఎఫ్, ఎన్సీపీ, పీడీఎస్)లతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పోటీ పడింది. లెఫ్ట్ ఫ్రంట్ 196 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బుద్దదేవ్ భట్టాచార్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 60 స్థానాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి ప్రతిపక్ష హోదా పొందింది. తిరిగి 2006లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ యూపీఏను వీడి.. ఎన్డీయేతో జతకట్టింది. ఎన్డీఏ కూటమిలో జేకేపీ(ఎన్), జేడీ(యు) ఏఐటీసీ, బీజేపీ పార్టీలుండగా.. యూపీఏ కూటమిలో కాంగ్రెస్, జీఎన్ఎల్ ఎఫ్, జేఎంఎం, ఎల్ జేపీ, పీడీఎస్, బీఎస్ పీ, ఐపీఎఫ్బీలున్నాయి ఆనాటి ఎన్నికల్లో. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ (ఏఐఎఫ్బీ, ఆర్ఎస్పీ, సీపీఐ, డబ్ల్యుఎస్పీ, ఆర్జేడీ, డీఎస్పీ-పీసీ, ఎన్సీపీ) 233 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2006 మే 18న సీఎంగా బుద్ధదేబ్ భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేశారు. 2011లో జరిగిన శాసన సభ ఎన్నికలల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ విజయపరంపరకు తెరపడింది. ఎన్డీఏను వదిలి మళ్లీ యూపీఏ కూటమిలో చేరిన తృణమూల్ కాంగ్రెస్… తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిట్టింగ్ సీఎంగా బరిలోకి దిగిన బుద్ధదేబ్ భట్టాచార్య జాదవ్ పూర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.

* లెఫ్ట్ పాలనకు చరమ గీతం
1977 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్‌కు తొలిసారి ఓటమి రుచి చూపించిన మమతాబెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏఐటీసీ- కాంగ్రెస్ కూటమి 228 స్థానాల్లో గెలుపొందింది. 2011 మే 20న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్- సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ కూటమితో కలిసి మహాజోత్ (సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్) ఏర్పాటైంది. 2016 ఏప్రిల్ 4-మే 5 మధ్య 294 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీకి దిగింది. ఏఐటీసీ 211 స్థానాల్లో విజయం సాధించింది. మహాజోత్ కూటమికి 44 స్థానాలు రాగా, ఎన్డీఏకు కేవలం 6 స్థానాలు దక్కాయి. 2016 మే 26.. మమతా బెనర్జీ రెండో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

* 2016లో మూడే సీట్లు
బెంగాల్‌‌‌‌లో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మూడే సీట్లు గెల్చుకున్న బీజేపీ.. ఇప్పుడు 200 సీట్లను గెల్చుకుంటామనే ధీమాతో ఉంది. 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 సీట్లకు 18 సీట్లు గెల్చుకోవడంతో బీజేపీలో ఆ భరోసా ఏర్పడింది. ఎన్నికల వ్యూహరచనలో సాటిలేని నేతగా పేరొందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌షా స్వయంగా బెంగాల్ ఎన్నికలపై ఫుల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టారు. బీజేపీ ప్రధాని మోడీ ఇమేజ్‌‌‌‌తో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా.. ఈ ఎన్నికలు మమత-అమిత్‌‌‌‌షా మధ్య పోరుగా కనిపిస్తోంది. తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రంలో ఒకేరోజు ఎన్నికలు జరుపుతూ బెంగాల్‌‌‌‌లో 8 విడతలుగా ఎన్నికలను ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.

* బీజేపీకి కలిసి వస్తున్న రాజకీయ శూన్యత
పదేండ్లపాటు అధికారంలో ఉన్న మమత సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. బీజేపీ పెద్ద ఎత్తున జంపింగ్‌‌‌‌లను ప్రోత్సహిస్తుండడంతో ఆమె పార్టీ కొంత బలహీనపడింది. మరోవైపు కాంగ్రెస్, సీపీఎం నేతలను ఆమె గతంలోనే ఆకర్షించడంతో ఆ పార్టీలు డీలాపడ్డాయి. ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడంలో బీజేపీ విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకూ కీలకంగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్‌‌‌‌ పార్టీలు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యేలా బీజేపీ చేయగలిగింది. ఐదేండ్ల వ్యవధిలో మహా శక్తిగా ఇక్కడ బీజేపీ ఎదిగింది. రాష్ట్రంలో 70% ఉన్న హిందువులపై బీజేపీ దృష్టి సారించింది. మమత పాలనలో వారేవిధంగా వివక్షతకు గురవుతున్నారో తెలియచెప్పగలిగింది. దాంతో గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో 40.64% ఓట్లతో 18 స్థానాలను గెలుచుకోగలిగింది. 43.69% ఓట్లు పొందిన తృణమూల్ కన్నా కొంచెమే వెనుకబడింది.

* ఫస్ట్‌ టైమ్‌ మమతలో కలవరపాటు
బీజేపీ పుంజుకోవడం తృణమూల్‌‌‌‌ పార్టీలో కలవరం పెంచింది. లోక్‌‌‌‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా మమత నిలదొక్కుకోవడం కష్టమనే సందేశం జనంలోకి వెళ్లింది. ఈ పరిస్థితుల్లో పాలనపై దృష్టి సారించి, ప్రజల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేయకుండా రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు గతంలో మాదిరిగా వీధి పోరాటాలకు మమత దిగే ప్రయత్నం చేయడంతో ఆమెకే చేటు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకే ముకుల్ రాయ్ వంటి నేత టీఎంసీ నుంచి బీజేపీలో చేరగా తాజాగా మాజీ మంత్రి సువేందు అధికారితోపాటు రెండు డజన్ల మందికిపైగా ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్‌‌ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ దూకుడును స్పష్టం చేస్తున్నాయి.

* ఒక్కటైన కాంగ్రెస్, లెఫ్ట్
50 ఏండ్ల పాటు ప్రత్యర్థులుగా తలపడిన కాంగ్రెస్, లెఫ్ట్‌‌‌‌ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇస్లాం మత ప్రచారకుడు అబ్బాస్ సిద్దిఖ్వి ఏర్పాటు చేసిన ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో సీట్ల సర్దుబాటు చేసుకొనేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. ఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌తో పొత్తు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సిద్దిఖ్వి ప్రభావం దక్షిణ బెంగాల్‌‌‌‌లోని నాలుగు జిల్లాలకే పరిమితం. కాంగ్రెస్, సీపీఎం మద్దతుదారులు బీజేపీలోకి వలస వస్తున్న సమయంలో మతోన్మాద పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్నికలు సమీపించేసరికి బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, బీహార్‌‌‌‌లో అసదుద్దీన్ ఒవైసీని అడ్డుపెట్టుకుని పూర్వాంచల్‌‌‌‌లో ముస్లిం ఓట్లను చీల్చి ప్రయోజనం పొందడంలో విజయమైన బీజేపీ ఎత్తుగడలు బెంగాల్‌‌‌‌లో ఏమాత్రం సాగుతాయనే సందేహాలు తలెత్తుతున్నాయి.

* సీఎం అభ్యర్థి లేకుండానే..
బెంగాల్‌‌‌‌లో మొత్తం అసెంబ్లీ సీట్లు 294. గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో 125 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత సాధించింది. మరో 25 సీట్లపై పట్టు సాధిస్తే అధికారంలోకి రావడమే అనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. అందుకే అమిత్‌‌‌‌షా, నడ్డా నుంచి బీజేపీ నేతలంతా 200 సీట్లు గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ‘మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి’ అంటూ మమతను ఢీకొనే నేత లేరనే ప్రచారం టీఎంసీ చేస్తున్నది. అయితే ప్రధాని మోడీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, చరిష్మాతోనే బీజేపీ ముందుకొస్తూ ఉండడంతో మమత ఆత్మరక్షణలో పడుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ గెలుపొందింది. ఇప్పుడు బెంగాల్‌‌‌‌లోనూ అదే ప్లాన్‌‌‌‌ను ఫాలో అవుతోంది.

* బెంగాల్ ఆడబిడ్డ.. బెంగాల్ మేనత్త
తన ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపి ప్రజల ముందు దోషిగా చూపుతున్న బీజేపీపై మమతలో అసహనం పెరుగుతున్నది. తనను తాను ‘బెంగాల్ ఆడబిడ్డ’గా చెప్పుకుంటూ బీజేపీని ‘బయటివారు’గా చిత్రీకరించే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. తనను వ్యతిరేకించే వారెవరూ బెంగాలీలు కాదన్నట్లు మమత అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తమ ‘ఆడబిడ్డ’నే తిరిగి బెంగాల్ ప్రజలు ఎన్నుకొంటారని మమత చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొడుతోంది. తొమ్మిది మంది మహిళా నాయకులతో ఒక పోస్టర్ విడుదల చేసి.. వారంతా బెంగాల్ ‘ఆడబిడ్డ’లని, బెంగాల్ ప్రజలు ‘మేనత్త’ రాజ్యం వద్దనుకొంటున్నారని ఎద్దేవా చేసింది. ఆమె పార్టీలో, పాలనలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర వహిస్తుండడంతో ‘మేనత్త- మేనల్లుడు’ పాలనగా బీజేపీ విమర్శిస్తున్నది.

* అన్ని వర్గాల్లోనూ బీజేపీ పట్ల సానుకూలత
బెంగాల్‌‌‌‌లో ముస్లింలు తప్ప అన్ని వర్గాలు మార్పునకు సానుకూలంగా ఉన్నట్లు హైదరాబాద్‌‌కు చెందిన పోల్ మానిటరింగ్ ఏజెన్సీ పీపుల్స్ పల్స్ ‘పశ్చిమబెంగాల్ మూడ్ రిపోర్ట్ 2021’లో వెల్లడించింది. సువేందు అధికారి వంటి బలమైన నేత నిష్క్రమించడంతో టీఎంసీ బలహీనమవుతున్నదని, బీజేపీ బలం పెంచుకుంటుందనే సూత్రీకరణను సంకలనం చేసిన ఈ రిపోర్ట్‌‌‌‌ను డా.సజ్జన్ కుమార్ తోసిపుచ్చారు. అలాగే లోక్‌‌‌‌సభ ఎన్నికల టైంలో బీజేపీకి మంచి మద్దతు లభించినా, అసెంబ్లీ ఎన్నికల్లో అది రిపీట్‌‌‌‌ కాదనే వాదనను సైతం ఆయన వ్యతిరేకించారు. బెంగాల్ ఎన్నికలు దేశంలోనే ఒక అనూహ్య రాజకీయ మార్పునకు సంకేతం కాగలవని ఆయన అంచనా వేస్తున్నారు. 2019 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో మార్పు వైపు ప్రజలను నడిపించిన అంశాలే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్లు ఈ రిపోర్ట్‌‌‌‌ స్పష్టం చేస్తోంది. టీఎంసీ వ్యతిరేకత 2018 పంచాయతీ ఎన్నికల నుంచి మొదలైనట్లు ఈ నివేదిక తెలిపింది.

-శ్రీనివాస్.బి