చెన్నైలో భారత్ కు గర్వభంగమైంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్ సొంతగడ్డుపై చిత్తుగా ఓడింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా టీం ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆల్ ఔట్అయ్యింది. దీంతో ఇంగ్లండ్ ఏకంగా 227 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ లో 1-0తో బోణీ కొట్టింది.
ఇంగ్లండ్ బౌలర్లు ఐదో రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండర్సన్ 3, లీచ్ 4 వికెట్లతో అద్భుత బౌలింగ్ చేశారు. భారత్ బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ విరాట్ 72, గిల్ 50 పరుగులతో పోరాడారు.
అంతకుముందు ఇంగ్లండ్ 178 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. 420 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు టీమిండియా బ్యాట్స్ మెన్ వైఫల్యంతో ఘోర ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియాలో పోరాడిన అశ్విన్, వాషింగ్టన్ సుందర్ లు సైతం చేతులెత్తేశారు. పూజారా, రహానే, పంత్ పూర్తిగా విఫలమయ్యారు.
కెప్టెన్ కోహ్లీ ఒంటరిపోరాటం చేసినా మరో ఎండ్ నుంచి సహకరించేవారు లేక టీమిండియా ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు 200 లోపే భారత్ ను కట్టడి చేశారు.