చైనా నుంచి ఊడిపడ్డ మహమ్మారి కరోనాకు చికిత్స లేదు. మందులు లేవు. కేవలం టీకాలు మాత్రమే సమర్థంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాటిని దేశంలో వేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోవీషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
అంతేకాకుండా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తోన్నట్లు తెలిపింది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న సమయంలో కోవిషీల్డ్ ప్రభావంపై దేశవ్యాప్తంగా 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ) జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.i
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు వైరస్ నుంచి 93శాతం మందికి రక్షణ పొందినట్లు నీతి అయోగ్ (ఆరోగ్యం) సభ్యులు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 98శాతం మందికి మరణం ముప్పు తగ్గిందని పేర్కొన్నారు.
కోవిడ్19 ఇన్ ఫెక్షన్ సోకుండా వ్యాక్సిన్లు 100శాతం రక్షణ కల్పించనప్పటికీ వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉందనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తోందని వీకే పాల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 44 కోట్ల 19 లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తీసుకున్న మొత్తం జనాభాలో 9.9 కోట్ల మందికి పూర్తిస్థాయిలో రెండు డోసులు ఇచ్చినట్లు తెలిపింది.