కేంద్రం ‘స్వదేశీ’ సోషల్ ఫైట్..

ఏది బలమైందని కేంద్రంలోని బీజేపీ భావించిందో.. ఇప్పుడు అదే వారికి శరాఘాతంగా మారింది. పాలు పెంచిన పామే కాటేసినట్టు.. దేశంలో అధికారంలోకి రావడానికి బీజేపీ, ఆ పార్టీ పెద్దాయన నరేంద్రమోడీ సోషల్ మీడియాను ఒక పెను ఆయుధంగా మలిచి వాడారు. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా బీజేపీని ఉలికిపడేలా చేస్తోంది. దేశంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించేలా చేస్తోంది. దేనిపై అయితే మోడీ ఎదిగాడో.. దానిలోనే ఆయనపై విమర్శలకు కారణమవుతోంది. దేశంలో బీజేపీ తెచ్చిన […]

Written By: NARESH, Updated On : February 22, 2021 9:40 am
Follow us on

ఏది బలమైందని కేంద్రంలోని బీజేపీ భావించిందో.. ఇప్పుడు అదే వారికి శరాఘాతంగా మారింది. పాలు పెంచిన పామే కాటేసినట్టు.. దేశంలో అధికారంలోకి రావడానికి బీజేపీ, ఆ పార్టీ పెద్దాయన నరేంద్రమోడీ సోషల్ మీడియాను ఒక పెను ఆయుధంగా మలిచి వాడారు.

కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా బీజేపీని ఉలికిపడేలా చేస్తోంది. దేశంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు ప్రశ్నించేలా చేస్తోంది. దేనిపై అయితే మోడీ ఎదిగాడో.. దానిలోనే ఆయనపై విమర్శలకు కారణమవుతోంది.

దేశంలో బీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతన్నలు మోడీ వాడే ట్విట్టర్ నే ఆయుధంగా చేసుకొని ఎంత పెద్ద ఉద్యమాన్ని చేశారో అందరికీ తెలిసిందే. ఇక వాట్సాప్ లోనూ గ్రూపులతో ఈ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విదేశీయుల చేతుల్లో ఉన్న ‘ట్విట్టర్’, వాట్సాప్, ఫేస్ బుక్ లలో పోస్టులు వెల్లువెత్తించి బీజేపీ పరువు తీశారు.

కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ట్విట్టర్ పై ఆ పోస్టులు తొలగించాలని హెచ్చరికలు పంపింది. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోబోమని ట్విట్టర్ సైతం కొన్ని తీసేసి.. మరికొన్ని పోస్టులను, ఖాతాలను బ్లాక్ చేయలేకపోయింది. దీంతో ట్విట్టర్ పై గుర్రుగా ఉన్న కేంద్రం..బెంగళూరు స్టార్టప్ కంపెనీ తయారు చేసిన స్వదేశీ యాప్ ‘కూ’ను ట్విట్టర్ కు ప్రత్యామ్మాయంగా ఫోకస్ చేసింది. కేంద్రమంత్రులు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ఇందులో ఖాతాలు తెరిచి విదేశీ ట్విట్టర్ కు షాకిచ్చారు.

ఇప్పుడు అది మరిచిపోకముందే ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్ ఉన్న వాట్సాప్ కు కేంద్రం షాకిచ్చింది. ఈ యాప్ కు ప్రత్యామ్మాయంగా కేంద్రప్రభుత్వం ‘సందేశ్’ అనే కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని కేంద్రప్రభుత్వం ఐటీ వ్యవహారలు చూసే ‘ఎన్.ఐసీ’ డిపార్ట్ మెంట్ మన దేశంలో లాంచ్ చేసి ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు అంతా వాడాలని సూచించడం విశేషం.

దీన్ని బట్టి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు విదేశీ సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేసి దేశంలో స్వదేశీ యాప్స్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించవచ్చన్న ధోరణితో సాగుతోంది. మరి ఇది ఫలిస్తాయా? ప్రజల గొంతు నొక్కేస్తారా? యాప్స్ ను తొక్కేస్తారా? అన్నది ముందు ముందు తేలనుంది.