Homeఅత్యంత ప్రజాదరణరంగంలోకి స్పీకర్ తమ్మినేని.. నిమ్మగడ్డకు షాక్ ఇవ్వడం సాధ్యమేనా?

రంగంలోకి స్పీకర్ తమ్మినేని.. నిమ్మగడ్డకు షాక్ ఇవ్వడం సాధ్యమేనా?

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు.. ఏపీ సీఎం జగన్ కు మధ్య పంచాయితీ ఎన్నికల సాక్షిగా ఏర్పడ్డ తగాదాలు అన్నీ ఇన్నీ కావు.. తాజాగా ఈ విభేదాలు మరో మలుపు తిరుగుతున్నాయి. చిలికిచిలికి గాలివానగా మారినట్లు.. ఈ వివాదం ఇప్పడు అసెంబ్లీ పరిధి వరకు వెళ్లింది. చట్టసభ వ్యవస్థను ఇందులో తలదూర్చేలా చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ రమేశ్ కుమార్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిలు స్పీకర్ తమ్మినేని సీతారాంకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ఈ లేఖల ఆధారంగా స్పీకర్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. తమపై ఎస్ఈసీ చేస్తున్న వ్యాఖ్యల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పరిధిలోని విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధుల హక్కులకు భంగం కలిగించేలా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారని కొద్దిరోజులుగా ఆయనపై విమర్శలు కురిపిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమపై ఫిర్యాదు చేస్తూ.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ దానిని మీడియాకు లీక్ చేశారని లేఖలో వివరించారు.

చట్టసభల వ్యవహారాలకు భంగం కలిగించేలా, తమ విధుల్లో అనవసరంగా జోక్యం చేసుకునేలా ఉందని వారు వివరించారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రజా ప్రతినిధుల హక్కులను పరిరక్షించే బాధ్యత స్పీకరుకు ఉంటుందని గుర్తు చేశారు. తమపై ఆరోపణలు , గవర్నర్ కు రాసిన లేఖలు లీక్ చేయడం వంటి చర్యలు సభాహక్కుల ఉల్లంఘన కింద పరిగణించాలని కోరారు.

దీన్ని పరిశీలించిన అనంతరం.. స్పీకర్ కార్యాలయం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు పంపించినట్లు తెలిసింది. దీన్ని ఈ మెయిల్ చేసినట్లు సమచారం. దీనికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎస్ఈసీని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా.. తదుపరి చర్యలు ఉండనున్నాయి. తాజాగా చేసుకున్న ఈ పరిణామం.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం.. జగన్ సర్కారు మధ్య కొనసాగుతున్న విభేదాల్లో చట్టసభా వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లయ్యింది.

అయితే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డకు.. అదే రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకోగలరా? అలాంటిది సాధ్యమా? నిమ్మగడ్డపై చర్యలకు అవకాశం ఉంటుందా? అనేది మాత్రం డౌటేనని రాజ్యంగ నిపుణులు చెబుతున్నారు. ఇది ఎటు దారితీస్తుందనేది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version